టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా
దీంతో.. కనీసం ఆస్ట్రేలియా పర్యటనలోనైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా ఆశిస్తోంది. ఆస్ట్రేలియా పిచ్లపై సత్తాచాటేందుకు ఏవైనా ప్రత్యేక వ్యూహాలతో వెళ్తున్నారా..? అని జస్ప్రీత్ బుమ్రాని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. తన బౌలింగ్ శైలిపై చేసే వ్యాఖ్యలను పట్టించుకోనని టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టు జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనకు సౌకర్యంగా ఉన్న శైలినే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. బుమ్రా బౌలింగ్ శైలి తరచూ గాయాల పాలయ్యేలా కనిపిస్తుందని పాకిస్థాన్ మాజీ పేసర్ అఖిబ్ జావెద్ అన్న సంగతి తెలిసిందే.
వెళ్లిన తర్వాత.. పిచ్ల గురించి అవగాహన
‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లిన తర్వాత.. అక్కడి పిచ్ల గురించి అవగాహన తెచ్చుకుంటా. అలా కాకుండా.. ఇక్కడి నుంచి ప్రత్యేక వ్యూహాలతో వెళితే.. అవి తారుమారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఫ్రెష్గా అక్కడి వెళ్లి.. పిచ్లకి అనుగుణంగా.. ప్లానింగ్ చేసుకుంటా' అని బుమ్రా వెల్లడించాడు.
నాకేది సహాయం చేసిందో దానిపైనే శ్రద్ధ
‘నిపుణులు ఏం చెప్తున్నారు ఏం చెప్పడం లేదని నేనెప్పుడూ దృష్టి సారించను. నాకేది సహాయం చేసిందో దానిపై శ్రద్ధ పెడతా. ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకొనేందుకు నా దేహంపై దృష్టిపెడతా. క్రికెట్లో ఒక స్పష్టమైన శైలి, లయ ఉండదు. ఒకవేళ ఉంటే గాయపడని బౌలర్ను చూపించండి. నా ఫిట్నెస్ స్థాయిని ఎలా మెరుగు పరచుకోవాలన్న దానిపైనే ఎల్లప్పుడూ దృష్టిసారిస్తా' అని బుమ్రా తెలిపాడు.
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మంచి సలహాలు
భారత్ జట్టు వెస్టిండీస్తో ఈనెల 21 నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆడనుండగా.. ఇప్పటికే తొలి రెండు వన్డేల కోసం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. అయితే.. ఈ జట్టు నుంచి కూడా బుమ్రా, భువీకి వారు విశ్రాంతినిచ్చారు. ‘టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మంచి సలహాలు ఇస్తారు. అండర్-19 శిబిరంలోనూ ఆయన వద్ద శిక్షణ తీసుకున్నా. నా బౌలింగ్ శైలి గురించి ఆయనకు బాగా తెలుసు. మ్యాచ్ల మధ్య విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం అలసట నుంచి తేరుకుంటుంది. తాజాగా ఉంటుంది. మంచి లయ దొరుకుతుంది' అని బుమ్రా పేర్కొన్నాడు.