పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో మళ్లీ విచారణకు హాజరు కానని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డీకే జైన్కు స్పష్టం చేశారు. క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ)లో సభ్యునిగా కొనసాగుతూ.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్గా కొనసాగడంపై మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేసాడు. దీంతో మంగళవారం అంబుడ్స్మన్ డీకే జైన్ ముందు లక్ష్మణ్, సచిన్ లు హాజరైయ్యారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఎలా పొందుతున్నారో రాత పూర్వకంగా వివరించాలంటూ జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచిన్, లక్ష్మణ్ మూడు గంటలకు పైగా తమ వాదనలు వెల్లడించారు. వాదనలు విన్న డీకే జైన్ తదుపరి విచారణకు ఈనెల 20న హాజరుకావాలని ఆదేశించారు.
ఈ విషయంపై లక్ష్మణ్ స్పందిస్తూ... పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయంలో జైన్కు అన్ని వివరించా. లిఖిత పూర్వక అఫిడవిట్ను కూడా దాఖలు చేసాను, కానీ తిరిగి విచారణకు హాజరుకానని అంబుడ్స్మన్కు తెలిపా. ఒక వేళ విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్లు రుజువైతే.. సీఏసీ పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నా అని లక్ష్మణ్ తెలిపారు.
లక్ష్మణ్ మంగళవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మరోవైపు సచిన్ కూడా హాజరై తమ వాదనలను వినిపించారు. ఇద్దరు సమర్పించిన నివేదికను అనుసరించి బీసీసీఐ అంబుడ్స్మన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే లక్ష్మణ్ తదుపరి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని అంబుడ్స్మన్ ఓ ప్రకటనలో తెలిపింది.