
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్లో జరిగిన మూడో వన్డేలో రిషబ్ పంత్ (125పరుగులు 113బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్), హార్దిక్ పాండ్యా (71పరుగులు 55బంతుల్లో 10ఫోర్లు) 5వ వికెట్కు 133పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇండియా 5వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వన్డే సిరీస్ 2-1తేడాతో ఇండియా కైవసం అయింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. హార్దిక్ తన తొలి స్పెల్లో 4ఓవర్లలో 3మెయిడిన్లు వేసి 2వికెట్లు తీసి 2పరుగులే ఇచ్చి అదరగొట్టాడు. ఇక ఓవరాల్గా హార్దిక్ తన బౌలింగ్లోనూ 7ఓవర్లలో 4వికెట్లు తీసి 24పరుగులే ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. అతను జాసన్ రాయ్, స్టోక్స్, లియామ్ లివింగ్ స్టోన్, జాస్ బట్లర్ లాంటి ప్రమాదకర ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాటర్లను ఔట్ చేసి స్కోరుబోర్డుకు కళ్లెం వేయగలిగాడు. ఇక ఈ సిరీస్లో 100పరుగులు, 6వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇక ప్రెజెంటేషన్ సందర్భంగా హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ అందుకున్న హార్దిక్ మాట్లాడుతూ.. 'వైట్ బాల్ క్రికెట్ వ్యక్తిగతం నాకు చాలా ఇష్టమైనది. ఇంగ్లాండ్ జట్టు ఎంత పటిష్టమైందో మనందరికీ తెలుసు. జట్టుగా మేము మా ప్లాన్స్ రూపొందించుకుని దాన్ని అమలు చేయడమే మాకు కీలకం. నా విషయంలో పరుగులు రాకుండా చూసుకోవడం.. వీలయినన్నీ ఎక్కువ డాట్ బాల్స్ వేయడం కోసం నేను ప్రయత్నిస్తా. నేను షార్ట్ బాల్స్ వేయడాన్ని ఇష్టపడతాను. ఇకపోతే బ్యాటర్లు నన్ను సింపుల్గా తీసుకోవడానికి చూడొద్దు. ఎందుకంటే నేను బౌలింగ్లో వేరియేషన్తో వేయగలను. నేను ఆరు సిక్సర్లు ఇచ్చినా బాధపడను.. తర్వాత వికెట్ తీశానా లేదా అనేది నాకు కీలకం. ఇకపోతే నా బౌలింగ్లో లివింగ్స్టోన్ హిట్టింగ్ చేయాలని చూశాడు. నాకో అవకాశం ఉంటుందని తెలుసు. అందువల్ల అతన్ని అలా ఔట్ చేయగలిగా. బౌలర్గా నేను ఎప్పుడూ షైగా ఫీల్ కాను. నా బౌలింగ్లో బ్యాటర్ ఎంత హిట్ చేసినా నా ఆత్మవిశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తా. ఇక రిషబ్ పంత్ ఎంత ప్రతిభవంతుడో మనకు తెలుసు. ఈరోజు అతను పరిస్థితిని బాగా అంచనా వేసి ఆడాడు. మా భాగస్వామ్యం ఆటను మలుపు తిప్పిందనుకుంటా. పంత్ గేమ్ ముగించిన విధానం చాలా స్పెషల్. ' అని హార్దిక్ పేర్కొన్నాడు.