
కోల్కతా: టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టులో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. భారత క్రికెట్ జట్టుకు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ గురువారం కరోనా బారిన పడటంతో.. టీమిండియా ప్రాక్టిస్ సెషన్ రద్దు అయ్యింది. బీసీసీఐ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారత జట్టుకు మరో ఫిజియోను అందుబాటులో ఉంచాలని బీసీసీఐ అధికారులు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ని కోరారు. ఇక శుక్రవారం మాంచెస్టర్లో చివరిదైన ఐదో టెస్ట్ ఆరంభం కానుంది. టీమిండియా శిబిరంలో కరోనా కేసులు కలవరపెడుతున్న వేళ.. ఇంగ్లండ్తో ఆఖరి టెస్టుపై సందేహాలు తలెత్తుతున్నాయి.
యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడటంతో మాంచెస్టర్లో ఉన్న జట్టు సభ్యులతో సంప్రదించిన బీసీసీఐ అధికారులు.. ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టును రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో.. క్యాష్ రిచ్ టోర్నీపై ఎటువంటి ప్రభావం పడకూడదన్న ఉద్దేశంలో బీసీసీఐ ఉంది. దాదాపుగా మ్యాచ్ రద్దయినట్టే అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. 'భారత శిబిరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందో లేదో మాకు తెలియదు. మ్యాచ్ జరగాలనే కోరుకుందాం' అని దాదా అన్నాడు. గురువారం కోల్కతాలో జరిగిన 'మిషన్ డామినేషన్' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంగూలీ పాల్గొని పైవిధంగా స్పందించాడు.
గురువారం మరో కరోనా కేసు బయటపడడంతో భారత సహాయ సిబ్బంది, ఆటగాళ్ల నుంచి బీసీసీఐ వైద్య బృందం శాంపిల్స్ సేకరించారు. ఈ రోజు రాత్రికి ఆర్టీ-పీసీఆర్ ఫలితాలు రానున్నాయి. వాటిపైనే చివరి మ్యాచ్ నిర్వహణ ఆధారపడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే ఓ ప్రకటనలో తెలిపాయి. అప్పటి వరకు ఆటగాళ్లు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని అధికారులు వారికి సూచించారు. దాంతో ప్లేయర్స్ అందరూ తమ కుటుంబాలతో కలిసి హోటల్ గదికే పరిమితమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీసీసీఐతో పాటు ప్లేయర్స్ కూడా కాస్త గురవుతున్నట్టు తెలుస్తోంది.
తన పుస్తకావిష్కరణ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి హాజరైన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, సీనియర్ ఫిజియో నితిన్ పటేల్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్లు కూడా ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇప్పుడు జూనియర్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ వైరస్ బారిన పడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ ఒక్కడే టీమిండియా ఆటగాళ్లకి అందుబాటులో ఉన్నాడు. ప్రస్తుతం ఐదు టెస్టులో సిరీస్లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఇదో టెస్ట్ జరగకుంటే.. సిరీస్ అసంపూర్ణంగా ఉంటుంది. అంటే.. మిగిలిన టెస్ట్ తరువాత ఆడవలసి ఉంటుంది. అది ఇప్పట్లో అయితే సాధ్యం కాదు.