టాస్ ఎవరు గెలిచారు? ఏం నిర్ణయం తీసుకున్నారు?
‘టాస్ను తొలగించాలన్న అభిప్రాయంతో నేను ఏకీభవించను. టాస్ ఎవరు గెలిచారు? ఏం నిర్ణయం తీసుకున్నారు? అన్న ఉత్కంఠను ప్రేక్షకులు మిస్సవుతారు. ఏం జరుగుతుందన్న ఉత్కంఠ టెస్టు మ్యాచ్లో భాగమే. టాస్ను తొలగించడమంటే ఆ ఉత్కంఠ క్షణాలను ప్రేక్షకులనుంచి లాగేసుకున్నట్టే' అని విశ్వనాథ్ అన్నాడు.
తొలిసారిగా 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టాస్
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా 1877లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే, ఇటీవలి కాలంలో పిచ్లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానం ఆతిథ్య జట్టుకే ఎక్కువ మేలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో టాస్ తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది.
మే 28, 29న ముంబైలో ఐసీసీ కమిటీ సమావేశం
దీనిపై చర్చించేందుకు ఐసీసీ నియమించిన కమిటీ మే 28, 29న ముంబైలో సమావేశం కానుంది. దిగ్గజ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండానే
అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్లో కూడా దేశవాళీ క్రికెట్లో టాస్కు స్వస్తి చెప్పాలంటూ గతంలో ప్రతిపాదనలు రాగా, బీసీసీఐ వాటిని పక్కనపెట్టింది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు.