న్యూఢిల్లీ: తనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్తో పోల్చవద్దని, అలా పోల్చితే చాలా ఇబ్బందికరంగా ఉందని విరాట్ కోహ్లీ చెప్పాడు. తనను తనలాగే చూడాలని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగులో ఇప్పుడు నేను పీక్ స్టేజ్కు చేరుకున్నానో లేదో తెలియదని చెప్పాడు.
కోచ్లు తరచుగా దీని గురించి చర్చిస్తుంటారన్నాడు. తనకు అయితే రెండు నెలల కిందటే ఆట మొదలు పెట్టినట్లుంటుందని చెప్పాడు.
గత రెండు నెలల్లో ఇదివరకటి కంటే బాగా ఆడుతున్నానని అందరూ చెబుతున్నారన్నాడు. తనకు ప్రైవసీ లేదని, అందరి దృష్టి తనపై ఉండటం ఇష్టముండదని చెప్పాడు. ప్రయివేట్ లైఫ్ అనేది హోటల్ రూంకే పరిమితమన్నాడు. నిత్య జీవితంలో ఒక యోగిలా, సన్యాసిలా జీవించాలనుకుంటానంటూ కోహ్లి ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడాడు.

నిత్యజీవితంలో అంటీముట్టనట్లు ఉండాలనేది తన సిద్ధాంతమని, నిరాడంబర జీవితం గడుపుతానని కోహ్లి తన మనసులో మాట చెప్పాడు. ఆటతో పాటు వ్యక్తిగత జీవితమూ ముఖ్యమే అన్నాడు. ఏ ఒక్కదానికో జీవితాన్ని అంకితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
కేవలం వృత్తిగత జీవితమే కాదని, జీవితంలో ఇంకా చాలా విషయాలు కీలకమని ఏదో ఒక దశలో అర్థమవుతుందన్నాడు. వృత్తిగత జీవితం ఏదో ఒక దశలో ముగుస్తుందని, అయితే పనిలో పడి మనం మనుషులతో కలవడమే మరిచిపోతుంటామన్నాడు.
దీని వల్ల వృత్తిగత జీవితం ముగియగానే జీవనం ఎలా కొనసాగించాలో అర్థం కాదని, మన పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదన్నాడు. కాబట్టి దేంతోనైనా అనుబంధం కలిగి ఉండటమే కాదు.. దాని నుంచి దూరంగా ఉండటానికి కూడా అలవాటు పడాలనుకున్నానని చెప్పాడు.