
కాన్వె డబుల్ సెంచరీ:
బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డేవాన్ కాన్వె డబుల్ సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులు చేసింది. కాన్వెతో పాటు హెన్రీ నికోల్స్ (61: 175 బంతుల్లో 4x4) పర్వాలేదనిపించాడు. టామ్ లాథమ్ (23), కేన్ విలియమ్సన్ (13), రాస్ టేలర్ (14), వాల్టింగ్ (1), గ్రాండ్హోమ్ (0) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మార్క్ వుడ్ మూడు, జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తీశారు.

చెలరేగిన సౌథీ:
ఆపై తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దెబ్బ తీశాడు. నిప్పులుచెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్మన్ను వరుసగా పెవిలియన్ చేర్చాడు. సౌథీతో పాటు మరో పేసర్ కైల్ జేమిసన్ (3/85) కూడా విజృంభించడంతో ఇంగ్లండ్ ఒక దశలో 140/6తో ఇబ్బందుల్లో పడింది. అయితే కెప్టెన్ జో రూట్ (42), ఓపెనర్ రోరీ బర్న్స్ (132; 297 బంతుల్లో 16×4, 1×6) పట్టుదలగా పోరాడాడు. బర్న్స్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు (275) అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ ఆరు వికెట్లు పడగొట్టగా.. జెమీషన్ మూడు, వాగ్నర్ ఒక వికెట్ తీశాడు.

169 రన్స్ వద్ద డిక్లేర్:
103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్ని 169/6తో డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ (36), రాస్ టేలర్ (33) రాణించారు. చివరి రోజు కివీస్ రెండో ఇన్నింగ్స్లో 52.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 చేసింది. ఈ సమయంలో మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించడంతో.. అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇదే సమయంలో కివీస్ సారథి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ ముందు 273 పరుగుల లక్ష్యంను కేన్ సేన ఉంచింది.

కివీస్కి భారీ ఊరట:
ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (60 నాటౌట్) అజేయ అర్థశతకం నమోదు చేయగా.. జో రూట్ (40: 71 బంతుల్లో 5x4) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 170/3తో నిలిచింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. డేవిడ్ కాన్వె డబుల్ సెంచరీతో వెలుగులోకి రావడం కివీస్కి భారీ ఊరట అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications












