
భారత్ తెలివైన వ్యూహం..
భారత జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి బంగ్లా ముందు 512 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో ఇదేమీ అసాధ్యమైన లక్ష్యం కాదు. అదే సమయంలో ఇక్కడి పిచ్ కూడా రోజులు గడిచే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా మారుతోంది. దీంతో తొందరపడిన టీమిండియా.. మూడో రోజు చివర్లో తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేసింది.
రోజు ఆట ముగిసేలోపు ఒకటో, రెండో బంగ్లా వికెట్లు కూలిస్తే మ్యాచ్లో పైచేయి సాధించవచ్చని భారత్ అనుకుంది. కానీ బంగ్లా జట్టు ఈ వ్యూహాలకు అడ్డుకట్ట వేసింది. నజ్ముల్ షాంటో (25 నాటౌట్), జాకిర్ హసన్ (17 నాటౌట్) ఇద్దరూ ఒక్క వికెట్ కూడా పడకుండా అడ్డుగా నిలిచారు.

టీమిండియా ప్లాన్ కరెక్టేనా?
మూడో రోజు బంగ్లా ఆలౌట్ అవగానే ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించకుండా భారత జట్టు బ్యాటింగ్ చేయడం కరెక్టేనా? అని టీమిండియా ప్లాన్పై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నిపుణులు మాత్రం భారత్ చేసిన పని కరెక్టే అంటున్నారు. బంగ్లా ముందు భారీ లక్ష్యం పెట్టడం ద్వారా వారిని ఒత్తిడిలోకి నెట్టేయవచ్చని వివరించారు.
అదే సమయంలో మూడో రోజు ఆట ముగియకముందే డిక్లేర్ చేయడాన్ని మాత్రం తప్పుబడుతున్నారు. దీని వల్ల భారత్కు ఒరిగేదేమీ లేదనేది వారి వాదన. ప్రస్తుతం మ్యాచ్ ఉన్న పరిస్థితిని చూస్తే వారి అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది.

అలా చేసుండాల్సింది..
మూడో రోజు బ్యాటింగ్ తీసుకున్న భారత్.. ఆ రోజు మొత్తం బ్యాటింగ్ చేసి ఉండాల్సిందని, కుదిరితే నాలుగో రోజు లంచ్ వరకు ఆడి ఆ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని విశ్లేషకుల అభిప్రాయం. ఇలా చేస్తే బంగ్లా ముందు భారీ లక్ష్యం ఉండటంతోపాటు వికెట్లు తీయడానికి భారత బౌలర్ల వద్ద కూడా చాలా సమయం ఉండేదని అంటున్నారు.
ఇప్పుడు భారత జట్టు మూడో రోజు చివర్లో డిక్లేర్ చేయడంతో బంగ్లా కేవలం 12 ఓవర్లు మాత్రమే ఆడింది. ఈ ఓవర్లలో వికెట్లు తీయడం అంత ఈజీ కాదు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 42/0తో మూడో రోజు ఆట ముగించింది. దీని వల్ల నాలుగో రోజు ఆట ఆరంభమైన తర్వాత భారత బౌలర్లపై కొంత ఒత్తిడి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.


Click it and Unblock the Notifications












