వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన రెండో అంతర్జాతీయ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు. అందరూ కూడా కెప్టెన్ పాండ్యా సింగిల్ తీసి అతనికి హాఫ్ సెంచరీ చేసుకునే అవకాశం కల్పిస్తాడని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా పాండ్యా సిక్సర్ బాది తిలక్ హాఫ్ సెంచరీని అడ్డుకున్నాడు.
ఇది చూసిన ఫ్యాన్స్, క్రికెట్ పండిట్లు ఆశ్చర్యపోయారు. ఈ సిరీసులో నెట్ రన్ రేట్ కీలకమైతే పాండ్యా చేసిన పనిని అర్థం చేసుకోవచ్చని, కానీ అలాంటిదేం లేదు కదా? అని పలువురు ప్రశ్నించారు. ఫ్యాన్స్ అయితే కోహ్లీ హాఫ్ సెంచరీకి సమీపంలో ఉండగా ధోనీ తన స్వభావానికి విరుద్ధంగా డిఫెన్స్ ఆడిన వీడియోను షేర్ చేస్తూ.. పాండ్యా ఎప్పటికీ లీడర్ కాలేడంటూ కామెంట్స్ చేశారు.

దీనిపై తాజాగా పాక్ మాజీ దిగ్గజం సల్మాన్ బట్ స్పందించాడు. పాండ్యాకు టీంవర్క్ అనే పదానికి అర్థం తెలిసినట్లు లేదని బట్ అన్నాడు. సహచర ఆటగాడు ఒక మైలురాయి అందుకోవడానికి సహకరిస్తే.. వాళ్లిద్దరూ చాలా దగ్గరవుతారని, తద్వారా టీంలో స్నేహభావం పెరుగుతుందని తెలిపాడు.
పాండ్యా సిక్సర్ బాదే సమయానికి భారత్ గెలవాలంటే 13 బంతుల్లో 2 పరుగులు చేయాలి. తిలక్ హాఫ్ సెంచరీ పూర్తి కావడానికి ఒక్క పరుగు కావాలి. ఇలాంటి సమయంలో పాండ్యా సిక్సర్ బాది మ్యాచ్ ముగించాడు. ఈ సందర్భంగా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ను బట్ ఉదహరించాడు.
ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి శతకం సాధించిన సమయంలో పాంటింగ్ కావాలని ఐదు డాట్ బాల్స్ ఆడాడు. ఈ విషయాన్ని బట్ గుర్తుచేశాడు. అదే సమయంలో వరుస ఓటముల తర్వాత ఎలాగైనా గెలవాలనే తపనలో పాండ్యా ఇలా చేసి ఉండొచ్చని కూడా బట్ అభిప్రాయపడ్డాడు.
'ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఒకటి నాకు బాగా గుర్తు. రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్ బ్యాటింగ్ చేస్తున్నారు. క్లార్క్ తన తొలి అంతర్జాతీయ శతకం చేసే ఛాన్స్ ఉంది. ఈ అవకాశం తనకు ఇవ్వడానికి పాంటింగ్ ఐదు డాట్ బాల్స్ ఆడాడు. బౌలర్ వైడ్ వేయడానికి ప్రయత్నిస్తే.. దాన్ని కూడా తన ప్యాడ్స్తో అడ్డుకున్నాడు' అని బట్ గుర్తుచేసుకున్నాడు.
'సహచర ఆటగాడు ఒక మైలురాయి అందుకోవడానికి సాయం చేస్తే.. దాన్నే టీం వర్క్ అంటారు. ఇది ఆ ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. ఇలాంటి చర్యల వల్ల ప్లేయర్ల మధ్య అంతరం తగ్గుతుంది. అదే సమయంలో పాండ్యా తనకు తానే మ్యాచ్ ఫినిష్ చేయడం తప్పేం కాదు. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో దీన్ని తొందరగా గెలవాలని ఆశపడి ఉండొచ్చు' అని బట్ చెప్పాడు.