అభిమానుల్ని తేరుకునేలా చేశాడు: మొర్తజా భావోద్వేగ సందేశం
హైదరాబాద్: బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మొర్తజా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవలేకపోవచ్చు. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానుల మనసులు మాత్రం గెలుచుకున్నాడు. దేశభక్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి ఓ ఫిలాసఫర్గా మారాడు. తన వ్యాఖ్యల ద్వారా టోర్నీలో తమ జట్టు ఓడిందనే బాధ నుంచి అభిమానుల్ని తేరుకునేలా చేశాడు.
అంతేకాదు క్రికెట్కు, దేశభక్తికి ముడిపెడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని చెప్పాడు. డాక్టర్లు, రైతులు, కూలీలు దేశానికి నిజమైన స్టార్లని.. క్రికెటర్లు కాదని తేల్చి చెప్పాడు. క్రికెటర్లుగా తాము దేశానికి చేసేదేం లేదని, డబ్బులు తీసుకుని క్రికెట్ ఆడే తమను హీరోలుగా కీర్తించొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

నేనొక క్రికెటర్ని, కానీ నేను ఓ ప్రాణాన్ని కాపాడగలనా?
‘నేనొక క్రికెటర్ని, కానీ నేను ఓ ప్రాణాన్ని కాపాడగలనా? ఓ డాక్టర్ కాపాడగలడు. కానీ దేశంలోని అత్యుత్తమ డాక్టర్ని ఎవరూ అభినందించరు. వారికి గుర్తింపు తీసుకురండి. ఇంకెన్నో ప్రాణాలను వాళ్లు నిలబెడతారు. వాళ్లు నిజమైన స్టార్లు. అలాగే శ్రామికులు కూడా. వాళ్లు దేశాన్ని నిర్మిస్తారు. క్రికెట్తో మేం ఏం నిర్మిస్తాం? క్రికెట్తో కనీసం ఒక ఇటుక తయారు చేయగలమా? క్రికెట్ మైదానంలో వరి పండుతుందా? ఇటుకలతో ఫ్యాక్టరీలు నిర్మించే శ్రామికులు.. పొలాల్లో పంటలు పడించేవాళ్లు నిజమైన స్టార్లు' అని మెుర్తాజా చెప్పాడు.

క్రికెటర్లుగా తాము చేసేదేమీ లేదు
క్రికెటర్లుగా తాము చేసేదేమీ లేదని, డబ్బులు తీసుకుని ఆర్టిస్టులుగా వ్యవహరిస్తున్నామని మెుర్తాజా తెలిపాడు. ‘క్రికెటర్లుగా మేం చేసేదేమిటి? నిజాయితీగా చెప్పాలంటే డబ్బులు తీసుకుంటాం, ఆట ఆడతాం. ఒక గాయకుడు, ఒక నటుడు చేసేదే మేమూ చేస్తాం. అంతకుమించి ఏం లేదు. క్రికెట్లో మా దేశ నిజమైన హీరోలంటే రకిబుల్ హసన్ లాంటి వాళ్లు. రకుల్ భాయ్ ధైర్యంగా ‘జాయ్ బంగ్లా' అని తన బ్యాట్పై రాసుకుని మైదానంలో అడుగుపెట్టారు (1971 స్వాతంత్య్ర పోరాట సమయంలో). అది గొప్ప విషయం. క్రికెట్ను వదిలి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలొదిలిన షోహిద్ జెవెల్ నిజమైన దేశభక్తుడు' అని భావోద్వేగంగా చెప్పాడు.

దేశభక్తి అంటూ తిరిగేవాళ్లు ఇకనైనా మారాలి
క్రికెట్ చుట్టూ దేశభక్తి దేశభక్తి అంటూ తిరిగేవాళ్లు ఇకనైనా మారాలని మెుర్తాజా హితవు పలికాడు. ‘క్రికెట్తో ముడిపడ్డ దేశభక్తి ఏంటో నాకర్థం కాలేదు. క్రికెటే దేశభక్తి అంటూ మాట్లాడేవాళ్లందరూ ముందు రోడ్డు మీద అరటి తొక్కలు వేయడం, వీధుల్లో ఉమ్మడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మానండి. అప్పుడు దేశం మారుతుంది. క్రికెట్ కోసం చాలా సమయం, శక్తి సామర్థ్యాలు వృథా చేస్తున్నారు. నిజాయితీగా పని చేయడానికి వాటిని ఉపయోగించండి. అది నిజమైన దేశభక్తి' అని మొర్తజా అన్నాడు.
మొర్తజాను పొగుడుతూ ట్వీట్ చేసిన శశిథరూర్
భారత్ లాంటి దేశంలో క్రికెట్ని ఓ మతంలా భావిస్తుంటారు. ఇక క్రికెటర్ల విషయానికి వస్తే తమను తాము మహిమాన్వితుల్లా భావిస్తుంటారు. అలాంటి వారికి మొర్తజా వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించేవే. ఇదిలా ఉంటే మొర్తజా వ్యాఖ్యలకు భారత రాజకీయ నాయకుడు శశిథరూర్ ముగ్దుడయ్యారు. మొర్తజాను పొగుడుతూ ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications