ఐపీఎల్ 2025 సమయం ఆసన్నమైంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మెగా లీగ్లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అని రెండు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు దీన్ని గెలుచుకున్నారు. అయితే ఇందులో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఏకైక పాకిస్థాన్ క్రికెటర్ ఒకడున్నాడని మీకు తెలుసా? అదేంటి ఐపీఎల్ లో పాకిస్థాన్ క్రికెటర్లు బ్యాన్ కదా అని అనుకుంటున్నారు?
ఆ పాకిస్థాన్ ప్లేయర్లు ఐపీఎల్ లో...
ఒకప్పుడు భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా జరిగాయో, అలానే ఐపీఎల్ ప్రారంభంలోనూ పాకిస్థాన్ క్రికెటర్లు ఈ మెగా లీగ్ ఆడారు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ లో (2008) ఆడేందుకు అన్ని దేశాల నుంచి క్రికెటర్లను ఆహ్వానించారు. అందులో పాకిస్థాన్ కూడా ఉంది. పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లైన షోయాబ్ మాలిక్, షోయాబ్ అక్తర్, మిషభ్ ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్.. ఇలా పలువురు ఐపీఎల్ తొలి ఎడిషన్ లో ఆడారు. అయితే ఆ తర్వాత 26/11 ముంబయిలో ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్ ప్లేయర్లను ఐపీఎల్ లో పాల్గొనకుండా బ్యాన్ చేశారు. రెండో సీజన్ నుంచే వారిపై నిషేధం విధించారు.

అతడికే పర్పుల్ క్యాప్..
అయితే తొలి సీజన్ లో ఆడిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ఈ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఆ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసినందుకు దీన్ని దక్కించుకున్నాడు. మొదటి సీజన్ లో షేన్ వార్న్ సారథ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ టైటిల్ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు సోహైల్. అలానే ఈ పర్పుల్ క్యాప్ అందుకున్న ఏకైక పాకిస్థాన్ క్రికెటర్ గా నిలిచాడు.
ఎన్ని వికెట్లు తీశాడంటే?
తన్వీర్ మొత్తంగా 11 మ్యాచుల్లో 6.46 ఎకానమీ, 12.09 సగటుతో 22 వికెట్లు తీశారు. అందులో 5 వికెట్ల ప్రదర్శన ఒకటి, 4 వికెట్ల ప్రదర్శన మరొకటి ఉంది. ఐపీఎల్ చరిత్రలో అతడి 14/6 బెస్ట్ స్పెల్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత అతడి స్పెల్ ను 12/6తో 2019లో అల్జారీ జోసెఫ్ బ్రేక్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై దీన్ని సాధించాడు.