
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మన్ సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని శనివారం ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రకటించిన కాసేపటికే.. రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 'ఎంఎస్ ధోనీ.. నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్' అంటూ ధోనీతో కలిసి ఉన్న చిత్రాన్ని జతచేసి రైనా తన ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నాడు.
2005లో వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన సురేష్ రైనా.. మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 116 పరుగులు. వన్డే ఫార్మాట్లో ఐదు సెంచరీలు, 36 అర్ధ శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టిన రైనా.. 18 టెస్టుల్లో 768 రన్స్ బాదాడు . ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్రేట్తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు.
2005 జూలైలో శ్రీలంకపై సురేష్ రైనా తొలి వన్డే ఆడాడు. 2010 జూలైలో లంకపైనే తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రైనా రాణించలేకపోయాడు. 2018 జూలై17న ఇంగ్లాండ్తో వన్డేలో ఆఖరి మ్యాచ్ ఆడాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ధోనీ, రైనా ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఒకేరోజు రిటైర్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి.
గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో సురేష్ రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. ఇక లాక్డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో రైనా పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఈ సీనియర్ క్రికెటర్ ఆశించాడు. కానీ ఇంతలోనే అతడు క్రికెట్కు గుడ్బై చెప్పాడు. సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. ఇన్ని సీజన్లలో ఒక్కసారి కూడా రైనా నిరాశపర్చలేదు.