టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 42వ పడిలో పడ్డాడు. జులై ఏడున పుట్టిన రోజు జరుపుకుంటున్న ధోనీకి ప్రపంచం నలుమూలల నుంచి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? ఎంఎస్ ధోనీ బయోపిక్ వచ్చిన తర్వాత అతని గురించి దాదాపు అన్ని విషయాలు అందరికీ తెలుసనే అనిపిస్తుంది. కానీ ఈ విషయాలు చాలా మందికి తెలియవు.
ధోనీకి అన్నయ్య..:ఎంఎస్ ధోనీ బయోపిక్లో అతనికి అన్నయ్య ఉన్నట్లు ఎక్కడా చూపించలేదు. కానీ ధోనీకి నరేంద్ర సింగ్ ధోనీ అనే అన్నయ్య ఉన్నాడు. సినిమాలో అతని పాత్ర లేకపోవడం గురించి ప్రశ్నిస్తే.. 'ఈ సినిమా ధోనీ గురించి, అతని జీవితంలో నాది అంత పెద్ద పాత్ర లేదు. అందుకే సినిమాలో నా క్యారక్టర్ లేదు. అయినా సినిమా ధోనీ గురించి కదా. నా పాత్ర లేకపోతే ఏం?' అని అన్నాడు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఉండటం గమనార్హం.

రహానే కెప్టెన్సీలో..:చెన్నై సూపర్ కింగ్స్పై ఐపీఎల్లో రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైజింగ్ పూణే సూపర్జెయింట్స్కు ధోనీ ఆడాడు. ఆ టీంకు స్టీవ్ స్మిత్ కెప్టెన్గా ఉన్నాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో మ్యాచ్లో స్మిత్ ఆడలేదు. ఇప్పుడు ఆ టీంకు రహానే కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్లో ధోనీ కీపర్గా పనిచేశాడు.
ఛారిటీ మ్యాచ్ కూడా..:తనకు మంచి పాపులారిటీ వచ్చిన తర్వాత 2015 సెప్టెంబరు 17న ఇంగ్లండ్లో జరిగిన ఒక ఛారిటీ మ్యాచ్లో ధోనీ ఆడాడు. గాయపడిన బ్రిటిష్ సైనికులు, వారి కుటుంబాల కోసం ఈ మ్యాచ్ ద్వారా విరాళాలు సేకరించారు. ఈ మ్యాచ్లో హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్ టీంకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించాడు. 22 బంతుల్లో 38 పరుగులు చేసి తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఒకే మ్యాచ్లో బౌలింగ్..:ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్కే ధోనీ ఆడుతున్నాడు. అయితే 2012లో ఒక మ్యాచ్లో ధోనీ తన కెప్టెన్సీ బాధ్యతలను సురేష్ రైనాకు ఇచ్చాడు. యార్క్షైర్తో జరిగిన ఈ మ్యాచ్లో వృద్ధిమాన్ సాహాతో వికెట్ కీపింగ్ చేయించాడు. ఈ మ్యాచ్లో ధోనీ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చాడు. చెన్నై టీంలో ధోనీ బౌలింగ్ చేసిన ఏకైక సందర్భం ఇదే.
జిడ్డు బ్యాటింగ్కు అవార్డు..:ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో ధోనీ చాలా నెమ్మదిగా ఆడాడు. కానీ చివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2008లో ఢిల్లీతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 188 పరుగుల టార్గెట్తో చెన్నై బరిలో దిగింది. ఈ మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ 33 బంతుల్లో 33 పరుగులే చేశాడు. అయినా సరే అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.