కెరీర్ ను ప్రణాళిక బద్దంగా చేసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే స్వీయ తప్పిదాలతో పాతాళానికి దిగజారిపోవాల్సి ఉంటుంది. క్రికెట్ లోనూ అంతే. అయితే తాజాగా.. ఎన్నో ఏళ్ల క్రితం ఊహించని విధంగా స్మగ్లర్ గా మారి కెరీర్ ను నాశనం చేసుకున్న ఓ ఆల్ రౌండర్ గురించి నెమరువేసుకుందాం.
బ్యాట్తో, బంతితో అదరగొట్టిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ లూయీస్ కూడా ఒకడు. అతడు ఆటతీరుతో ఎంతో మంది క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. అతడి కెరీర్ సుదీర్ఘంగా కొనసాగితే ఇయాన్ బోథమ్లా గొప్ప ఆల్రౌండర్ అవుతాడని ప్రతీ క్రికెట్ అభిమాని అనుకున్నాడు.

కానీ జీవితంలోకి ఎదిగే కొద్ది అంతే క్రమశిక్షణతో మెలగాలి. లేదంటే ఎంతటివాడైనా కిందపడాల్సిందే. క్రిస్ లూయీస్ జీవితంలోనూ ఇదే జరిగింది. మంచిగా ఆడుతోన్న సమయంలోనే తన చెడు ప్రవర్తనతో వార్తల్లో నిలిచేవాడు. క్రమశిక్షణారాహిత్యం, సహచరులతో దురుసుగా ప్రవర్తించడం, ప్రాక్టీస్ సెషన్ లకు ఆలస్యంగా రావడం.. ఇలా ఎన్నో స్వీయ తప్పిదాలు అతడిపైనే తీవ్రంగా ప్రభావం చేశాయి. దీంతో అతడికి జట్టులో చోటు దక్కడమే కష్టమైపోయింది.
దీంతో క్రిస్ లాయీస్ అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా స్మగ్లర్గా మారిపోయాడు. ఓ సందర్భంలో రూ.1.5 కోటి విలువైన ద్రవరూప కొకైన్ను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పుడు న్యాయస్థానం అతడి 13 ఏళ్ల జైలుశిక్ష కూడా విధించింది. అనంతరం జైలు శిక్ష అనుభవించిన అతడు జైలు నుంచి విడుదల కూడా అయ్యాడు. ఇప్పుడు సాధారణమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సంఘటన.
భారత్పై తొలి సెంచరీ..
క్రిస్ లూయిస్ కెరీర్ లో మొత్తం 32 టెస్టులు, 53 వన్డే మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 1105 పరుగులు,93 వికెట్లు తీశాడు. ఓ సెంచరీ, 4 అర్ధ శతకాలు కూడా బాదాడు. వన్డేల్లో 374 పరుగులు, 66 వికెట్లు పడగొట్టాడు. 1993లో భారత పర్యటనకు వచ్చిన అతడు.. చెన్నై వేదికగా టెస్ట్ ఆడాడు. ఆ మ్యాచ్ లో అతడు తన తొలి సెంచరీని బాదాడు.కానీ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయింది.