
ఇంటికి వెళ్తుండగా ప్రమాదం..
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని పంత్ వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. వేగంగా వెళ్తుండగా అతని కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కిటికీ అద్దం పగలడంతో దానిలో నుంచి బయట పడేందుకు పంత్ ప్రయత్నించాడు. ఆలోపే వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక హరియాణా బస్సులో డ్రైవర్ సుశీల్ కుమార్.. తన బస్సును రోడ్డు పక్కన ఆపేసి కిందకు పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్ను పూర్తిగా బయటకు లాగి, ఒక బెడ్షీట్తో అతన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించాడు.

ప్రముఖులు పరామర్శ..
ఈ నేపథ్యంలో అతన్ని డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న పంత్ను బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్ తదితరులతోపాటు ఢిల్లీ జట్టులో పంత్తో కలిసి ఆడిన నితీష్ రాణా వంటి వాళ్లు సందర్శించారు. అనంతరం పంత్ ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు అక్కడకు వచ్చిన శ్యామ్ శర్మ.. ప్రస్తుతానికైతే పంత్ ఆరోగ్యం కుదురుగానే ఉందని చెప్పాడు. అవసరమైతే అతన్ని హెలికాప్టర్లో ఢిల్లీ తీసుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రస్తుతం ఆ అవసరం లేదని తెలిపాడు. అలాగే ఇప్పటికైతే ఎవరూ పంత్న కలవడానికి ఆస్పత్రికి రావొద్దని, దీని వల్ల పంత్కు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వివరించాడు.

ప్రమాదానికి అసలు కారణం..
పంత్ నిద్ర మత్తులో తూలడంతో ప్రమాదం జరిగినట్లు పలు వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే అది నిజం కాదని శ్యామ్ శర్మ తెలిపాడు. పంత్ తనతో మాట్లాడాడని, చికిత్స అనంతరం చక్కగా రెస్పాండ్ అవుతున్నాడని చెప్పిన ఆయన.. రోడ్డుపై ఒక గుంతను తప్పించడానికి ప్రయత్నించినప్పుడు తన కారు అదుపు తప్పినట్లు పంత్ చెప్పాడని వెల్లడించాడు. అదుపు తప్పిన కారు వెళ్లి డివైడర్ను ఢీకొట్టిందని, ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయని శ్యామ్ శర్మ వివరించారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే పంత్ కోలుకుంటున్నాడని శుభవార్త చెప్పాడు.


Click it and Unblock the Notifications












