
టీమిండియా వచ్చే ఏడాది ఆడే తొలి సిరీస్ శ్రీలంకతోనే. ఆ జట్టుతో ఆడే టీ20 సిరీస్లో టీమిండియా కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. అయితే వన్డే సిరీస్కు మాత్రం వీళ్లు అందుబాటులో ఉంటారు. ఇలా ఈ సీనియర్ ఆటగాళ్లు మాటి మాటికీ విశ్రాంతి తీసుకోవడం ఏం బాగలేదని, అది కూడా వన్డే వరల్డ్ కప్ ఉన్న ఏడాదిలో అన్నిసార్లు రెస్ట్ తీసుకోవడం ఏంటని గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది అక్టోబర్, నవంబరు నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఈ ఏడాదిలో ఆడే వన్డే మ్యాచులన్నీ ఆడాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచులన్నీ వాళ్లకు చాలా కీలకమని, కాబట్టి విశ్రాంతి తీసుకోకుండా వన్డేలన్నీ ఆడాలని గంభీర్ సూచించాడు. గతంలో మూడుసార్లు వేరే దేశాలతో కలిసి వరల్డ్ కప్నకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి మాత్రం పూర్తిగా భారత్ వేదికగానే మెగా టోర్నీ జరగనుంది.
వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే భారత జట్టు ఏం చేయాలని అడగ్గా.. 'ముందుగా జట్టు కోర్ ఏదో గుర్తించాలి. ఇటీవలి కాలంలో మరీ ఎక్కువ మార్పులు, చేర్పులు చేసేశారు. దీంతో సెటిల్డ్గా ఉన్న ఒక బృందమే కనిపించలేదు. దానికితోడు ఏడాది చివర్ల వరల్డ్ కప్ ఉన్న సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. జట్టులో కోర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితర ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకూడదు. వీళ్లందరూ కలిసి నిలకడగా ఆడాలి. వరల్డ్ కప్ సంవత్సరంలో మరీ ఎక్కువ బ్రేకులు తీసుకోకూడదు' అని గంభీర్ స్పష్టం చేశాడు.