Maharashtra Premier League: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కూడా దేశంలో టీ20 క్రికెట్ ఉత్సాహం కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక క్రికెట్ లీగ్లు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి మహారాష్ట్రలో కూడా జరుగుతోంది. ఈ లీగ్లో ఒక బ్యాటర్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ బ్యాటర్ మరెవరో కాదు.. దివ్యాంగ్ హింగనేకర్. ఈ ప్లేయర్ ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు.
5 బంతుల్లో 5 సిక్సర్లు
రత్నగిరి జెట్స్ తరఫున ఆడుతూ దివ్యాంగ్ హింగనేకర్ ఈ ఘనత సాధించాడు. మహారాష్ట్ర ప్రీమియర్ 2025లో భాగంగా రత్నగిరి జెట్స్, కొల్హాపూర్ టస్కర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రత్నగిరి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. కేవలం 3 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. దీంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును ఆదుకున్నారు. కెప్టెన్ అజీమ్ ఖాజీ, దివ్యాంగ్ హింగానేకర్ కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దివ్యాంగ్ కేవలం 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. దివ్యాంగ్ హింగనేకర్ 6 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సర్లను బాది దివ్యాంగ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

11వ ఓవర్లో అద్భుతం
దివ్యాంగ్ హింగనేకర్ 11వ ఓవర్లో అధర్వ డక్వే వేసిన మొదటి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. దివ్యాంగ్ ఆరో సిక్స్ కొట్టడంలో విఫలమయ్యాడు. కానీ ఈ ఓవర్లో రత్నగిరి జెట్స్ జట్టుకు 32 పరుగులు వచ్చాయి. దివ్యాంగ్ రెచ్చిపోవడంతో అధర్వ డక్వే ఈ మ్యాచ్ లో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. అధర్వ 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చాడు. దివ్యాంగ్ హింగనేకర్ దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున ఆడతాడు.
మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. దివ్యాంగ్ హింగనేకర్ మహారాష్ట్ర తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అతను ఇప్పటివరకు 40 టీ20 మ్యాచ్లు ఆడాడు. వాటిలో 297 పరుగులు చేసి, 30 వికెట్లు కూడా తీశాడు.