
హైదరాబాద్: టీమిండియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీల వికెట్లే టార్గెట్ ఐపీఎల్ లో వాళ్లని ఖచ్చితంగా అవుట్ చేస్తానంటున్నాడు ఈ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్లో కుల్దీప్ కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు.
జనవరి నెలలో జరిగిన వేలంలో నైట్రైడర్స్ ఫ్రాంఛైజీ రూ. 5.8 కోట్లకి కుల్దీప్ యాదవ్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం కోల్కతా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఈ మణికట్టు స్పిన్నర్ సన్నద్ధత గురించి మీడియాతో మాట్లాడాడు. ఏడాది ముందు వరకూ కోల్కత్తా జట్టులో సునీల్ నరైన్, బ్రాడ్ హగ్లతో పాటుగా ప్రత్యామ్నాయ బౌలర్గా ఉన్న కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగాడు.
అలాంటిది ఈ యువ స్పిన్నర్ ఈ ఏడాది ప్రధాన స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. సంవత్సారంభంలో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చూపించిన కుల్దీప్ నైట్ రైడర్స్ జట్టుకు బలం చేకూర్చగలడని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
ప్రాక్టీసు మధ్యలో మీడియాతో మాట్లాడిన కుల్దీప్.. 'ఐపీఎల్ 2018లో నాకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవని చెబితే అది అబద్దమే అవుతుంది. స్పిన్ని సమర్థంగా ఎదుర్కొనే విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ వికెట్లను ఈ టోర్నీలో తీయడమే నా టార్గెట్. ఐపీఎల్లో మాత్రమే నాకు ఈ అవకాశం దొరుకుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ వారి వికెట్ తీసే ఛాన్స్ నాకు రాదు కదా.? (నవ్వుతూ). అందుకే.. ఐపీఎల్లో వారిని ఢీకొట్టి వికెట్ పడగొట్టాలని ఆశపడుతున్నా' అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.
ఈ సారి ఐపీఎల్కి అన్ని జట్లు క్రీడాకారులను మార్చుకున్న నేపథ్యంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు ఏర్పడతాయని హర్షం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా యువ ఆటగాళ్ల సత్తా ఏంటో చూపిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. గత ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ మణికట్టు స్పిన్నర్.. ప్రస్తుతం వన్డే, టీ20 జట్టులో తిరుగులేని స్పిన్నర్గా కొనసాగుతున్నాడు.