
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ వార్నర్ శనివారం మీడియా ముందుకు రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్క్రాప్ట్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
స్మిత్, వార్నర్పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్క్రాప్ట్పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. నిషేధం కారణంగా స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్ గురువారం దక్షిణాఫ్రికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సిడ్నీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్మిత్ మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అదే విధంగా బాన్క్రాప్ట్ కూడా మీడియాతో మాట్లాడుతూ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ క్షమాపణలు చెప్పాడు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
శనివారం సిడ్నీలో డేవిడ్ వార్నర్ మీడియా సమావేశంలో మాట్లాడతాడని అందులో పేర్కొన్నారు. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి విమానాశ్రయానికి వచ్చిన డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ భర్త భుజంపై తల వాల్చి బోరున ఏడ్చేసిన దృశ్యం అభిమానుల్ని ఎంతగానో కలచివేసింది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్మిత్, వార్నర్కు మద్దతుగా నిలిచారు.
ఈ కఠిన పరిస్థితుల్లో వారికి, వారి కుటుంబసభ్యులకు మద్దుతుగా ఉండాలని ఎంతో మంది క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరిన సమయంలో బాల్ టాంపరింగ్ ఘటనలో తన పాత్రకు చింతిస్తున్నానని, అందుకు క్షమించాలని వార్నర్ కోరిన సంగతి తెలిసిందే.
తాము చేసిన తప్పిదాలు క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీశాయని వార్నర్ అంగీకరించాడు. 'ఆ ఉదంతంలో నేను వహించిన పాత్రకు పూర్తి బాధ్యత వహిస్తున్నా. అందుకు క్షమించాలని వేడుకొంటున్నా. మా తప్పిదంతో క్రికెట్కు జరిగిన చేటు, అభిమానులకు కలిగిన క్షోభను అర్థం చేసుకోగలను. బాల్యం నుంచి క్రికెట్ అంటే పడిచచ్చే నేను..నా ప్రవర్తనతో దానికి చెడ్డపేరు తెచ్చా' అని అన్నాడు.