ధోనీకి యువీ మద్దతు:
కుటుంబ సభ్యులతో అమెరికాలో ఎంజాయ్ చేసిన ధోనీ తాజాగా స్వదేశానికి చేరుకున్నాడు. అయినా.. ధోనీ రిటైర్మెంట్పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని ఆలోచించి త్వరగా ప్రకటించాలని మాజీలు ఘాటుగానే స్పందించారు. అయితే యువీ మాత్రం ధోనీకి మద్దతుగా నిలిచాడు. మంగళవారం 'ది స్పోర్ట్స్ మూవ్మెంట్' సదస్సులో పాల్గొన్న యువరాజ్.. ధోనీ రిటైర్మెంట్పై మాట్లాడాడు.
ఎప్పుడు రిటైరవ్వాలో ధోనీకి తెలుసు:
'ధోనీ రిటైర్మెంట్పై నిరంతర చర్చ జరగడం సబబు కాదు. భారత క్రికెట్కు ఎంతో సేవ చేశాడు. టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. ఆలోచించి నిర్ణయం తీసుకునేంత సమయం ఇవ్వాలి. ఆటకు ఎప్పుడు వీడ్కోలు పలకాలో ధోనీకి బాగా తెలుసు. ఎప్పుడు తప్పుకోవాలో అతడే నిర్ణయించుకోవాలి. మహీనే ఈ విషయం స్పష్టం చేయాలి. ఒకవేళ ధోనీ ఇంకా ఆడాలనుకుంటే.. అతడి నిర్ణయాన్ని గౌరవించాల్సిందే' అని యువరాజ్ అన్నాడు.
ధోనీ లోటును పూడ్చలేం:
'ధోనీ లేని లోటును మాత్రం మనం ఎప్పటికి పూడ్చలేం. ధోనీతో యువ క్రికెటర్ రిషభ్ పంత్ను పోల్చడం సరైనది కాదు. ధోనీ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. పంత్కు కూడా సమయం ఇవ్వాలి. టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా ఒక సంవత్సరం ఉంది. పంత్పై విమర్శలు ఆపండి. ధోనీతో పోల్చుతూ పంత్పై ఒత్తిడి తెస్తున్నారు. పంత్కు అవకాశాలు ఇచ్చారు. కానీ.. అతడికి సమయం పడుతుంది. రిషభ్ పంత్ ఆట తీరుపై కాస్త ఓపిక పట్టండి' అని యువీ కోరాడు.
పంత్ను సరైన దారిలో నడిపించాలి:
'పంత్లో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉంది. అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరుగులు చేసేలా స్వేచ్ఛ ఇవ్వాలి. పంత్ను సరైన దారిలో నడిపించాలి. అతడి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా మరెవరైనా అతడికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది' అని యువీ చెప్పుకొచ్చారు.