హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫీనిక్స్ పక్షి లాంటి వాడని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం అన్నాడు. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండిస్ పర్యటనలో చోటు దక్కించుకున్న యువరాజ్ సింగ్ ఏ మాత్రం రాణించలేదు.
అంతేకాదు లంక పర్యనటకు ముందు నిర్వహించిన యో-యో పరీక్షలో కూడా విఫలమయ్యాడు. దీంతో పరిమిత ఓవర్ల సిరిస్ కోసం లక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో యువీ చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్కు కూడా యువీని ఎంపిక చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ వన్డే సిరిస్కు ముందు సెప్టెంబర్ 12న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్కి ఎంపిక చేసిన జట్టులో కూడా యువరాజ్కు చోటు దక్కలేదు.
దీంతో భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ శకం ముగిసిందని ఇప్పటికే క్రీడా విశ్లేషకులు అంచనాకు వచ్చారు. అయితే మాజీ సెలక్టర్ సబా కరీం మాత్రం అలాంటిది ఏమీ లేదని యువీకి మద్దతుగా నిలవడం విశేషం. క్రికెట్ నెక్ట్స్కి ఇచ్చిన ఇంటర్యూలో యువీ... చితాభస్మం నుంచి మళ్లీ జన్మించే ఫీనిక్స్ పక్షి లాంటి వాడని పేర్కొన్నాడు.
'యువీని మీరెలాగైనా అనుకోండి. అతను ఫీనిక్స్ పక్షిలాంటి వాడు. చితాభస్మం నుంచి ఫీనిక్స్ మళ్లీ పుట్టినట్టే యువరాజ్ కూడా ఎదుగుతూనే విమర్శకులకు తన సత్తా ఏంటో చాటతాడు. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉండొచ్చు. యువీ ఛాంపియన్ ఫెర్పామర్ అని, అది మళ్లీ రుజువవుతుంది' అని అన్నాడు.
'ప్రస్తుతం యువీ ఫిట్నెస్పై దృష్టిపెట్టాల్సి వుంది. నిజం చెప్పాలంటే నేను సెలక్టర్గా ఉన్నప్పుడూ యువీ ఎంపిక కష్టతరం అయ్యేంది. అయితే అతనెప్పడూ మమల్ని తప్పు అని నిరూపించి జట్టులోకి వచ్చేవాడు. అందుకు నేనూ సంతోషించేవాడిని. యువీ ఇప్పుడు దేశవాళీ మ్యాచ్లు ఆడి నిరూపించుకోవాల్సి ఉంది. అతడి పునరాగమనం మాత్రం అంత సులువు కాదు. యువీ అనుభవం ఎప్పటికైనా జట్టుకు అవసరమే' అని కరీం అన్నాడు.