ఇంగ్లాండ్తో భారత్ మరో సమరానికి సిద్ధమైంది. తొలి టెస్టులో ఊహించని పరాజయానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ప్రధాన ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో యువ బ్యాటింగ్ లైనప్తో రోహిత్ సేన కఠిన పరీక్ష ఎదుర్కోనుంది. అయిదు టెస్టుల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఇవాళ నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో తలపడనుంది. తొలి టెస్టులో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
కాగా, రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో మూడు కీలక మార్పులు చేశామని రోహిత్ తెలిపాడు. కేఎల్ రాహుల్ గాయంతో జట్టులో చోటు సంపాదించిన సర్ఫరాజ్ తుదిజట్టులో ఎంపిక కాలేకపోయాడు. రజత్ పటిదార్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. జడేజా, సిరాజ్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చారు. వాషింగ్టన్ సుందర్కు అవకాశం దక్కలేదు.

''మేం మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగుంది. మంచి క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాం. హైదరాబాద్లో జరిగింది చరిత్ర. దాన్ని నుంచి బయటకు వచ్చాం. ఏ విషయాల్లో పురోగతి సాధించాలో చర్చించుకున్నాం. మా ప్లాన్లను అమలు చేసేలా ట్రై చేస్తాం. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో బాగానే బ్యాటింగ్ చేశాం. కానీ రెండో ఇన్నింగ్స్లో అదే తీవ్రతతో పరుగులు చేయలేకపోయాం''
''ఇంగ్లాండ్ బంతితో రాణించింది. ఒలీ పోప్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆటలో గాయాలు సహజమే. కానీ మా బెంచ్ సామర్థ్యం పటిష్టంగానే ఉంది. కేఎల్ రాహుల్, జడేజా దూరమవ్వడంతో జట్టులో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. అలాగే సిరాజ్కు విశ్రాంతి ఇచ్చాం. ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. రజత్ పటిదార్ అరంగేట్రం చేస్తున్నాడు'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్