జట్టు సమతూకంతో ఉంది
ఈ క్రమంలో మహమ్మద్ అజహరుద్దీన్ కూడా టీమిండియా విజయావకాశాలపై స్పందించారు. 'ప్రపంచకప్ విజేతగా నిలిచేందుకు టీమిండియాకు ఇదే మంచి అవకాశం. మిగతా జట్లతో పోల్చితే.. ప్రస్తుతం మన జట్టు సమతూకంతో ఉంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్.. పేసర్లు, స్పిన్నర్లతో బౌలింగ్ బలంగా ఉంది. గతంతో చూసుకుంటే ఫీల్డింగ్ కూడా ఎంతో మెరుగయ్యింది' అని అజహరుద్దీన్ పేర్కొన్నారు.
కోహ్లీ గురించి ఆందోళన అనవసరం
'ప్రస్తుత భారత జట్టు అత్యుత్తమైనది. మన జట్టు కప్ గెలువకపోతే నిరాశ చెందుతా. కప్ తీసుకొస్తారనే నమ్మకం ఉంది. ఐపీఎల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించకపోయినా ప్రపంచకప్లో పరుగులు చేస్తాడనే నమ్మకం ఉంది. జీవితంలో ఒడిదొడుకులు సహజం. కోహ్లీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అజహరుద్దీన్ చెప్పుకొచ్చారు.
కప్ గెలిచే సత్తా భారత్కు ఉంది
తాజాగా వెంగ్సర్కార్ మాట్లాడుతూ... 'ప్రస్తుత జట్టును చూస్తే ప్రపంచకప్ గెలిచేందుకు భారత్కు ఇది మంచి అవకాశం. విరాట్ సేన కప్ సాదిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమిండియా సెమీ ఫైనల్స్కు అర్హత సాధిస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఫైనల్ గురించి ఇప్పుడే అంచనా వేయలేను. టైటిల్ పోరులో నిలిచే సత్తా భారత్కు ఉంది. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్లో ఉన్నారు. వారికి విజయం చేకూరాలని ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నా' అని అన్నారు.