హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఊహించని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అందుకున్న బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అయితే ఆ కారును మెయింటెయిన్ చేసే శక్తి తనకు లేకపోవడంతోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టమైన పని. రోడ్డుపై ఎక్కువగా గుంతలు, ఎత్తుపల్లాలు ఉండటంతో పాడయ్యే అవకాశాలే ఎక్కువ.
దీంతో అంత ఖరీదైన కారు పాడవుతుందనే ఉద్దేశంతో దీప ఈ నిర్ణయానికొచ్చింది. దీంతో పాటు అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదు. ఈ కారణంగానే సచిన్ చేతుల మీదగా అందుకున్న బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని ఆమె కోచ్ బిశ్వేస్వర్ నంది తెలిపారు.

ఇదే విషయాన్ని ఇప్పటికే చాముండేశ్వరి నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై చాముండేశ్వరి నాథ్ కూడా స్పందించారని... కారుని పంపితే, ఆ కారు ఖరీదుని దీపా అకౌంట్లో వేస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే త్వరలోనే జర్మనీలో జరిగే చాలెంజర్స్ కప్ పోటీల్లో పాల్గొనడానికి దీపా సిద్ధమవుతోంది.
కాగా, సెప్టెంబర్లో పీవీ సింధుకు, దీపా కర్మాకర్కు, సాక్షి మాలిక్కు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరి నాథ్ కార్లను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.