సొంతగడ్డపై భారత్కు ఊహించని పరాభవం ఎదురైంది. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే అని క్రికెట్ విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మరింత బాధ్యతగా ఆడాల్సిందని అంటున్నారు. అయితే విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్లో తడబడుతున్న కోహ్లికి కొన్ని ముఖ్య సూచనలు చేశాడు.

2021 నుంచి ఆసియాలో కోహ్లి 27 ఇన్నింగ్స్ల్లో 22 సార్లు స్పిన్లోనే ఔటయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ చేతిలో 11 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ బలహీనతను అధిగమించాలంటే కోహ్లి తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్లు ముప్పును ఎదుర్కోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడటానికి వెళ్లాలని కోహ్లికి సూచించాడు.
''న్యూజిలాండ్ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్లో మూడు సార్లు ఔటైన తీరు కోహ్లిని తీవ్రంగా నిరాశపరిచి ఉంటుంది. అతన్ని స్పిన్నర్లు ఇబ్బంది పెట్టడం పునరావృతం అవుతుంది. దీని నుంచి అతను బలంగా బయటకురావాలి. అతను సమాధానాలు వెతికే వ్యక్తి. సూపర్ స్టార్డమ్కు చేరుకున్న తర్వాత సవాళ్లు ఎదురువుతుంటాయి. ఇప్పుడు మరో సవాలు ఉంది. స్పిన్ పిచ్ల్లో టీమిండియా ఆడాలనుకుంటుంది. మరి విరాట్ కోహ్లి గేమ్ ప్లాన్ ఏంటి?''
''విరాట్ కోహ్లి సామర్థ్యం ఏంటో మనకి తెలుసు. ఈ సిరీస్ ఫలితం అతనేంటో నిర్ధారించలేదు. అయితే ఫ్యాన్స్ చెబుతున్నట్లుగా గత కొంతకాలగా కోహ్లి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గత రెండు మూడేళ్లలో స్పిన్కు వ్యతిరేకంగా అతని రికార్డు గొప్పగా ఏమీ లేదు. అతను ఏం చేయాలంటే.. దేశవాళీ క్రికెట్ తిరిగి వెళ్లాలి. ప్రస్తుత డీఆర్ఎస్ రూల్స్పై ఫోకస్ చేస్తూ ఆడాలి. ఎడమచేతి వాటం బౌలర్లు ప్రధాన ముప్పుగా ఉంటారనడంలో సందేహం లేదు'' అని డీకే అన్నాడు. 2012 నుంచి కోహ్లి దేశవాళీ క్రికెట్ ఆడలేదు.