
మరో 3-4 సంవత్సరాలు ఆడుతా:
దినేశ్ కార్తీక్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'నేను ఫిట్గా ఉన్నంత కాలం ఆడటం కొనసాగిస్తా. మరో 3-4 సంవత్సరాలు ఆడుతా. నాకు మంచి ఫిట్నెస్ ఉంది. ఎందుకు ఆడకూడదు అనే దానికి ఎటువంటి కారణం లేదు. టీ20ల్లో నేను గతంలోనే కాదు.. ఇప్పుడు కూడా బాగా ఆడుతున్నా. నిజమే 2019 వన్డే ప్రపంచకప్లో అంచనాల్ని అందుకోలేకపోయాను. కానీ టీ20ల్లో అప్పటి వరకూ మెరుగ్గా ఆడాను. మరి టీ20ల్లోనూ ఎందుకు 2019 ప్రపంచకప్ నుంచి పక్కన పెడుతున్నారు' అని ప్రశ్నించాడు.

మంచి ఫినిషర్ కావాలి:
'భారత సెలెక్టర్లు వయసుని చూడటం లేదు. కేవలం ఫిట్నెస్, ఆటని చూస్తున్నారు. నీకు ఫిట్నెస్ టెస్టుని నిర్వహిస్తున్నారంటే.. టీమిండియాకి ఆడే సామర్థ్యం నీకు ఉందని వాళ్లు విశ్వసించినట్లే కదా?. బ్యాక్ టు బ్యాక్ టీ20 ప్రపంచకప్లు జరగబోతున్నాయి. ఈ రెండు మెగా టోర్నీల్లో ఆడాలని ఆశిస్తున్నా. అందులో భాగం కావడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నా. మిడిల్ ఆర్డర్లో టీమిండియాకు ఫినిషర్ అవసరమని నాకు తెలుసు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉన్నారని నాకు తెలుసు. స్పెసలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్పై నా దృష్టిని ఉంచాను. అది ఒక ప్రత్యేకమైన స్లాట్ అని నేను భావిస్తున్నాను' అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.

ప్రస్తుత ఆటగాళ్లు వ్యాఖ్యానం చేస్తారు:
'ఫుట్బాల్ మరియు ఎన్బిఏలను ఓసారి చూస్తే.. ప్రస్తుత ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా వారికి జట్టులో చోటు దక్కనప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. భారత దేశంలో అలా కాదు. వ్యాఖ్యాతగా వెళితే.. ఆ అతగాడి కెరీర్ ఇక పూర్తయింది అని అనుకుంటారు. ఫుట్బాల్ ఆటలో ప్రస్తుత ఆటగాళ్లు స్టూడియోలో కూర్చుని మాట్లాడతారు. ఎన్బిఏ మరియు టెన్నిస్లో కూడా ఇదే జరుగుతుంది. క్రికెట్లో మాత్రం ఇది ఎందుకు భిన్నంగా ఉండాలి?' అని దినేశ్ కార్తీక్ ప్రశ్నించాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.

గవాస్కర్కు తోడుగా కార్తీక్:
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు తోడుగా దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానం చేయబోతున్నాడు. సౌథాంప్టన్లో ఈనెల 18న ఆరంభమయ్యే ఈ చరిత్రాత్మక పోరులో వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది. 'భారత క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న సమయంలో కార్తీక్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో నాతో కలిసి వ్యాఖ్యానం చెప్పబోతున్నాడు. కామెంట్రీ బాక్స్లోనూ డీకే రాణిస్తాడని అనుకుంటున్నా. అతడికి నా అభినందనలు' అని సన్నీ పేర్కొన్నాడు.

మహీ కంటే ముందే ఎంట్రీ ఇచ్చినా:
ఎంఎస్ ధోనీ కంటే ముందే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి దినేశ్ కార్తీక్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా మాత్రం చేయలేకపోయాడు. ధోనీ వెలుగులోకి వచ్చిన తర్వాత బ్యాట్స్మెన్గా మాత్రమే టీమ్లోకి ఎంపికవుతూ వచ్చిన కార్తీక్.. ఆ తరవాత టీమిండియాకి పూర్తిగా దూరమైపోయాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు తరఫున నిలకడగా ఆడుతూ వచ్చిన కార్తీక్.. 2018 నిదహాస్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఒక్కసారిగా హీరో అయ్యాడు. తర్వాత 2019 వన్డే ప్రపంచకప్కి కూడా భారత సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో నెం.5 స్థానంలో బ్యాటింగ్కి దిగి.. 25 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి కార్తీక్పై వేటు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












