వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాదు. బ్యాటింగ్ కోచ్, మెంటార్గా బాధ్యతలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సోమవారం ప్రకటించింది. ఐపీఎల్-2024 సీజన్లో ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. లీగ్కు వీడ్కోలు పలికిన బాధ, ఆర్సీబీకి కప్ను అందించలేదనే నిరాశతో కార్తీక్ కన్నీటిని ఆపుకుంటూ మైదానాన్ని వీడుతూ అభిమానులకు అభివాదం చేశాడు. అయితే జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా అన్ని రకాల పోటీ క్రికెట్కు డీకే అధికారికంగా గుడ్బై చెప్పేశాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు.

''మా వికెట్కీపర్కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ కొత్త అవతారంతో తిరిగి ఆర్సీబీకి వచ్చాడు. ఆర్సీబీ మెన్స్ టీమ్కు బ్యాటింగ్ కోచ్గా, మెంటార్గా బాధ్యతలు అందుకోనున్నాడు. క్రికెట్ నుంచి అతన్ని వేరు చేయొచ్చు. కానీ అతని నుంచి క్రికెట్ దూరం కాదు'' అని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఐపీఎల్లో అతనికి ఉన్న అనుభవం, ఆర్సీబీ జట్టుపై ఉన్న అవగాహనతో డీకేను ఆర్సీబీ తిరిగి తమ గూటికి తీసుకువచ్చింది.
ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ క్రికెటర్ గతంలో ఎన్నోసార్లు కోచింగ్ స్టాఫ్గా ఆర్సీబీకి తిరిగి రావాలని ఉందని వెల్లడిస్తున్నప్పటికీ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కానీ భారత యువ ప్లేయర్లపై అవగాహన, దేశంలోని అన్ని వేదికల్లో పిచ్పై అనుభవం ఉండటంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ దినేశ్ కార్తీక్కే మొగ్గు చూపించింది. మరికొన్ని నెలల్లో మెగావేలం ఉండటంతో త్వరగా డీకేను ఫ్రాంచైజీలోకి తీసుకువచ్చింది.
కాగా, ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు లీగ్లో కొనసాగుతున్న అతికొద్ది మంది ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ ఒక్కరు. లీగ్లో తన ప్రయాణాన్ని కార్తీక్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్డెవిల్స్) నుంచి ప్రారంభించాడు. ఆర్సీబీతో పాటు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తరఫున కూడా డీకే ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడిన డీకే 26.32 సగటు, 135 స్ట్రైక్రేటుతో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తీక్ సత్తాచాటాడు. 162 స్ట్రైక్రేటుతో 937 పరుగులు చేశాడు.