టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్ని రకాల పోటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించిన సమయంలోనే డీకే ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడని అందరికీ స్పష్టమైంది. కానీ ఆ సమయంలో కార్తీక్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఆర్సీబీతో సహా ఇతర ఫ్రాంచైజీలు డీకేకు గుడ్బై చెబుతూ పోస్ట్లు పెట్టారు.
అయితే శనివారం తన 39వ జన్మదిన సందర్భంగా దినేశ్ కార్తీక్ తన రిటైర్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. పోటీ క్రికెట్ నుంచి తప్పుకున్నాని ,ఎంతో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని సోషల్ మీడియా వేదికగా డీకే వెల్లడించాడు. ''చాలా కాలం ఆలోచించిన తర్వాత పోటీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. కొత్త సవాళ్లకు సిద్ధమవుతున్నా''

''ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చిన నా కోచ్లు, కెప్టెన్లు, సెలక్టర్లు, జట్టు సహాయ సిబ్బందికి ధన్యవాదాలు. లక్షలాది మంది క్రీడాకారులు ఉన్న మన దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నా అదృష్టం '' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. కాగా, రెండు దశాబ్దాల పాటు భారత్కు ప్రాతినిథ్యం వహించి ఆటకు వీడ్కోలు పలికిన డీకే సరికొత్త రికార్డు సృష్టించాడు.
భారత్ తరఫున అత్యధిక కాలం క్రికెట్ ఆడిన వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ చరిత్రకెక్కాడు. 2004 సెప్టెంబర్ 5న డీకే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో తొలి వన్డే ఆడాడు. ఓవరాల్గా 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 1025 పరుగులు, వన్డేల్లో 1752, పొట్టి క్రికెట్లో 686 పరుగులు చేశాడు.
అయితే 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం డీకేకు ఇక భారత జట్టులో చోటు దక్కదని భావించారంతా. కానీ ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేసి 2022 టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యాడు. ఈ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచే కార్తీక్ కెరీర్లో ఆఖరిది. అంతర్జాతీయ క్రికెట్లో 172 ఔట్లలో డీకే పాలు పంచుకున్నాడు. కాగా, ఐపీఎల్లో 17 సీజన్లలో కార్తీక్ ఆడాడు. అన్ని సీజన్లలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో డీకే ఒకరు. లీగ్లో 257 మ్యాచ్లాడిన అతను 4842 పరుగులు సాధించాడు.