
హైదరాబాద్: మూడు సంవత్సరాలుగా నిరీక్షించి టీమిండియాలో చోటు దక్కించుకున్న సురేశ్ రైనాకు మళ్లీ బాధలు తప్పేట్టులేదు. కొద్ది రోజుల ముందే ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియాలో సురేశ్ రైనా భాగమై ఉన్నాడు. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ను విజయవంతంగా ముగించిన టీమిండియా వన్డే మ్యాచ్లకు సిద్ధం అవుతోంది. అయితే ఈ వన్డే సిరీస్కు.. భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఈ వన్డే సిరీస్ కోసం తొలుత సెలక్టర్లు అంబటి రాయుడుని జట్టులోకి ఎంపిక చేయగా.. అతను యో-యో ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవడంతో సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. దీంతో.. రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి రైనా పునరాగమనం చేసినా.. అతనికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమేనని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
శ్రీలంకలో ముగిసిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో కేవలం 8 బంతుల్లో 29 పరుగులు చేసి.. ఆఖరి బంతికి భారత్ జట్టుని గెలిపించిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత కూడా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో 498 పరుగులు చేసి ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే, టీ20 జట్టులో స్థానం సంపాదించాడు. అయినప్పటికీ ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టీ20 సిరీస్లో అతనికి అవకాశాలు దక్కలేదు. దీంతో.. కనీసం వన్డేల్లోనైనా సురేశ్ రైనా స్థానంలో అతడి పేరుని టీమిండియా మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకుంటుందని సెహ్వాగ్ అంచనా వేశాడు.
'వన్డే సిరీస్లో దినేశ్ కార్తీక్కి కచ్చితంగా తుది జట్టులో అవకాశం దక్కుతుందని విశ్వసిస్తున్నా. ఇటీవల ముగిసిన ఐపీఎల్తో పాటు.. అంతకముందు జరిగిన నిదహాస్ టోర్నీలో దినేశ్ కార్తీక్ అత్యుత్తమంగా రాణించాడు. అందుకే.. కార్తీక్ని ఆడించేందుకు ఇదే తగిన సమయమని నా అంచనా. అదే జరిగితే సురేశ్ రైనా మిడిలార్డర్లో కార్తీక్ కోసం తన స్థానాన్ని వదులుకోవాల్సిందే' అంటూ సెహ్వాగ్ జట్టు తీరును విశ్లేషించాడు.