
చెన్నై: మాజీ డాషింగ్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రత్యర్థి జట్లపై చూపించిన ప్రభావమే ప్రస్తుతం రిషబ్ పంత్ చూపిస్తున్నాడని టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. అన్ని విభాగాల్లో పంత్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్ల వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఎంతోమంది జాతీయ జట్టులోకి వచ్చారని డీకే అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కీపర్లలో వృద్ధిమాన్ సాహా ఒకడని ప్రశంసించాడు. ఇక ఫిట్నెస్ ఉన్నంత వరకు క్రికెట్ ఆడతానని డీకే స్పష్టం చేశాడు.
దినేశ్ కార్తీక్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'రిషబ్ పంత్ జట్టుకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తాడు. అవసరం మేరకు అదనపు బౌలర్ లేదా బ్యాట్స్మన్ను తీసుకొనేందుకు జట్టు యాజమాన్యానికి అవకాశం దొరుకుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. పంత్ ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. వీరేంద్ర సెహ్వాగ్, ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడూ చూపిస్తున్నాడు. అతని ఆట అద్భుతంగా ఉంది. విదేశాల్లో కూడా బాగా రాణిస్తున్నాడు. పంత్ తక్కువ కాలంలోనే కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఐపీఎల్ అతనికి ఎంతగానో ఉపయోగపడింది' అని అన్నాడు.
తన కెరీర్ సాగిన తీరుకు గర్వపడతానని దినేశ్ కార్తీక్ తెలిపాడు. భారత జట్టులో దొరికిన ప్రతి అవకాశాన్నీ ఆస్వాదించానని పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశానికి ఆడకముందే కుర్రాళ్లు పరిణతి సాధిస్తున్నారని వెల్లడించాడు. ఐపీఎల్లో వారు అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడటమే ఇందుకు కారణమని డీకే వివరించాడు. ఐపీఎల్ లీగ్ వల్ల ప్రతిభావంతులైన వికెట్ కీపర్లు బయటకు వచ్చారని, జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను కార్తీక్ ఆడాడు.
ఇప్పుడు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కాకుండా బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్లు తయారవుతున్నారని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో వృద్ధిమాన్ సాహా ఒకడని ప్రశంసించాడు. రిషబ్ పంత్ అద్భుత బ్యాటింగ్ మెరుపులతో సాహాకు చోటు దొరకడం లేదని అభిప్రాయపడ్డాడు. ఇతర దేశాల్లో వీడ్కోలు తీసుకోకముందే వ్యాఖ్యానం చేస్తుంటారని తెలిపాడు. అందుకే తానూ కామెంటరీ చేయబోతున్నానని వివరించాడు. ఫిట్నెస్ ఉన్నంత వరకు క్రికెట్లో కొనసాగుతానని డీకే స్పష్టం చేశాడు.