హైదరాబాద్: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టులు ఆడాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు దినేశ్ కార్తీక్. భారత జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో దినేశ్ కార్తీక్కు పెద్దగా అవకాశాలు రావడం లేదనేది అందరికీ తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కించుకున్న దినేశ్ బ్యాట్తో మెరిశాడు.
చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్ నిర్ణయాత్మక ఐదో వన్డేలో 50 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ ఆ తర్వాత జరిగిన ఏకైక టీ20లో 48 పరుగులు చేశాడు. దీంతో మూడేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నట్లు అయింది. తనకు టెస్టుల్లో కూడా తిరిగి ఆడాలని ఉందనే విషయాన్ని స్పష్టం చేశాడు.

ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. 'ప్రస్తుతం వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాను. తెలుపు రంగు జెర్సీ ధరించి టెస్టు జట్టులో స్థానం సంపాదించి, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడాలన్నది ప్రస్తుతం నా కల. జట్టుకు ఏ రకంగా ఉపయోగపడగలను అనేది మాత్రమే నాకు తెలుసు. అందుకోసం తీవ్రంగా సాధన చేస్తున్నా' అని కార్తీక్ తెలిపాడు.
'ఈ ఫార్మాట్లో రాణించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ఒకవేళ జట్టులో స్థానం దక్కితే మిడిలార్డర్లో నా ముద్ర వేస్తా. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎటువంటి ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకిచ్చిన పనిని సరిగ్గా చేయడంపైనే దృష్టి పెట్టా. 2019 వరల్డ్ కప్ లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా' అని కార్తీక్ తెలిపాడు.
భారత్ తరుపున 2010లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో దినేశ్ కార్తీక్ చివరిసారిగా ఆడాడు. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కూడా దినేశ్ కార్తీక్కు చోటు దక్కలేదు.