
బెంగళూరు: టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఫామ్లో లేకపోవడం వల్ల ఇక దాదాపుగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడే అవకాశాలు లేవనుకున్న దశలో రాకెట్లా దూసుకొచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ తరువాత జట్టులో ది బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్లో తానేమిటో నిరూపించుకున్నాడు. తాను ఆడుతోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొన్ని మ్యాచ్లల్లో ఒంటిచేత్తో గెలిపించాడు.
తనను తాను మళ్లీ తీర్చిదిద్దుకున్నాడు. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 37 సంవత్సరాల వయస్సులో టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే మాటలు కాదు. తనపై సెలెక్టర్లు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయట్లేదు దినేష్ కార్తీక్. కేప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోన్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్నాడు. ఐపీఎల్ తరువాత టీ20 సిరీస్ అంతర్జాతీయ సిరీస్లల్లో ఆడాడు.

దినేష్ కార్తీక్ మళ్లీ జాతీయ జట్టులో చేరేలా అతనికి బంగారంలాంటి అవకాశాన్ని ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్లో అతణ్ని జట్టులోకి తీసుకోవడంతో అతని కేరీర్ మళ్లీ గాడిన పడింది. కోల్కత నైట్ రైడర్స్ అతన్ని విడిచి పెట్టిన తరువాత మళ్లీ ఎవరూ ఆసక్తి చూపని దశలో ఆర్సీబీ అతని వైపు మొగ్గ చూపింది. మెగా వేలంపాట సందర్భంగా అతన్ని జట్టులోకి తీసుకుంది. దీని వెనుక గల కారణాలను తాజాగా వెల్లడించారు ఆర్సీబీ డైరెక్టర్ (ఆపరేషన్స్) మైక్ హెస్సన్.
దినేష్ కార్తీక్ను జట్టులోకి తీసుకోవడానికి ముందు అతనితో మాట్లాడామని మైక్ హెస్సన్ చెప్పారు. జట్టులో అతని రోల్ ఏమిటీ?..ఎందుకు తీసుకుంటోన్నాం..? అనే విషయాల గురించి వివరించామని పేర్కొన్నారు. దాని ఫలితం ఏమిటనేది అందరూ చూశారని గుర్తు చేశారు. తన తప్పులను అతను తెలుసుకున్నాడని, వాటిని రిపీట్ చేయడమే నమ్మకం తమకు కలిగిందని వ్యాఖ్యానించారు. ఆ నమ్మకంతో జట్టులోకి తీసుకున్నామని, దాన్ని నిలబెట్టుకున్నాడని మైక్ హెస్సన్ అన్నారు.