దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అసలేం జరిగిదంటే.. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ఫార్మాట్లలో కలిపి తన ఆల్టైమ్ భారత క్రికెట్ జట్టును డీకే ప్రకటించాడు. 12వ ఆటగాడిగా హర్భజన్ సింగ్ పేరును పేర్కొన్నాడు. అయితే కార్తీక్ ఆల్టైమ్ ఎలవెన్లో ధోనీ పేరు లేదు.
సారథిగా దేశానికి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను అందించిన ధోనీని డీకే విస్మరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో దినేశ్ కార్తీక్ తాను ప్రకటించిన జట్టు గురించి వివరణ ఇచ్చాడు. తన జట్టులో వికెట్ కీపర్ స్థానాన్నే మర్చిపోయానని, అందరూ రాహుల్ ద్రవిడ్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశానని అనుకున్నారని డీకే అన్నాడు.

''నేను పెద్ద తప్పు చేశాను. అది పొరపాటును జరిగింది. ఎపిసోడ్ రిలీజ్ తర్వాత ఈ విషయం నాకు అర్థమైంది. ప్రకటించిన 11 మందిలో వికెట్ కీపర్ మిస్ చేశాను. కానీ, ద్రవిడ్ను పార్ట్ టైమ్ వికెట్ కీపర్గా తీసుకున్నారని అనుకున్నారంతా. కానీ ద్రవిడ్ను కీపర్గా భావించి తీసుకోలేదు. వికెట్ కీపర్ను అయిన నేను.. వికెట్ కీపర్ ఎంపికను మర్చిపోయారంటే నమ్ముతారా? ఇది చాలా పెద్ద పొరపాటు''
''ఇక ఓ విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ధోనీ పేరు ఏ ఫార్మాట్లోనైనా ఉంటుంది. భారత్లోనే కాదు, ఎక్కడైనా. గొప్ప క్రికెటర్లలో అతనొక్కడు. ఇక ఆల్టైమ్ జట్టును మళ్లీ ప్రకటించాల్సి వస్తే నేను చేసే మార్పు ఒక్కటే. ధోనీ ఏడో స్థానంలో ఉంటాడు. అంతేగాక ఏ భారత జట్టుకు అయినా అతనే కెప్టెన్'' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
దినేశ్ కార్తీక్ ప్రకటించిన ఆల్టైమ్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ఖాన్; 12వ ఆటగాడు: హర్భజన్ సింగ్.