
టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా అత్యంత కీలక ప్లేయర్లుగా మారబోతున్నారని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు ప్రస్తుతం అత్యధిక స్ట్రైక్ రేట్లతో బ్యాటింగ్ చేయగల ఫినిషర్లు అవసరమని కైఫ్ పేర్కొన్నాడు. హార్దిక్, దినేశ్ కార్తీక్ లాంటి ఆటగాళ్ల సామర్థ్యం భారత్కు అవసరమని కైఫ్ ప్రస్తావించాడు. పాండ్యా, కార్తీక్ భారత జట్టును బలోపేతం చేస్తారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ప్లేయింగ్ 11లోనే వీరిద్దరిని తాను చూస్తానని కైఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
'ఇండియా టాపార్డర్ని చూసినట్లయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ లాంటి చాలా మంది మేటి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఆటను సరిగ్గా ఫినిష్ చేయడానిక తగిన ప్లేయర్లు లేరు. ఇక హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ రూపంలో ప్రస్తుతం ఇద్దరు ఫినిషర్లు ఉన్నారు. భారత్కు ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడగల ఫినిషర్లు అవసరం కాబట్టి.. వీరిద్దరు ఆ తరహా బ్యాటర్లుగా తప్పకుండా ఉపయోగపడతారు' అని సోనీ స్పోర్ట్స్ నిర్వహించిన వర్చువల్ ఇంటరాక్షన్లో కైఫ్ పేర్కొన్నాడు.
'వీరిద్దరూ ఫినిషింగ్లో మళ్లీ మళ్లీ రాణించడం నేను చూశాను. ఇకపోతే ఐపీఎల్లోనూ, దక్షిణాఫ్రికా సిరీస్లోనూ వీరిద్దరూ చివర్లో తమదైన స్టైల్లో ఫినిషింగ్ నాక్స్ ఆడారు. రాబోయే ఐర్లాండ్ పర్యటనలోనూ వీరి ఫామ్ కీలకం కానుంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లోనూ వీళ్లు తమ ఒరవడిని కొనసాగించాలి. అలాగే ముందుకు వెళితే వీరు తప్పకుండా టీ20 ప్రపంచకప్ జట్టులో ఫినిషర్లుగా ఉంటారు. ఇక భారత్ ప్రపంచకప్ గెలవలంటే వీరు కీలక పాత్ర పోషించాల్సిందేనని' కైఫ్ చెప్పాడు.
ఐర్లాండ్తో భారత్ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హార్దిక్ పాండ్యా ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఆ జట్టుకు ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో కూడా హార్దిక్ ఆఖర్లో తన సత్తా మేరకు రాణించాడు. ఇకపోతే ప్రపంచ కప్కు ముందు తమ టీ20 సెటప్ విషయంలో సరైన మార్పులు జరగాలని బీసీసీఐ యోచిస్తుంది. గత యూఏఈ ఎడిషన్ టోర్నీలో భారత్ లీగ్ స్టేజీలోనే ఇంటి బాట పట్టి ఘోర పరాభవాన్ని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే.