హైదరాబాద్: శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్, కోచ్ చందికా హతురసింఘె, మేనేజర్ అసంక గురుసిన్హా తాము బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు అంగీకరించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.3.1ను ఉల్లంఘించినట్లు వాళ్లు అంగీకరించారని ఐసీసీ అధికారికంగా వెల్లడించింది.
క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఈ ముగ్గురూ కనీసం రెండు టెస్టు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్టికల్ 2.3.1ను లెవల్ 3 తప్పిదంగా గుర్తిస్తారు. శిక్ష నిర్ధారించడం కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ను కూడా ఐసీసీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి జ్యూడిషియల్ కమిషనర్గా మైఖెల్ బేలాఫ్ను ఐసీసీ నియమించింది. ఈ తప్పిదం కింద నాలుగు నుంచి ఎనిమిది సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. కరేబియన్ గడ్డపై బాల్ టాంపరింగ్ ఉదంతం బయటపడిన తర్వాత వెస్టిండిస్తో రెండో టెస్టు మూడో రోజు గ్రౌండ్లోకి రావడానికి శ్రీలంక జట్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.
ఆటలో భాగంగా రెండో రోజు ఆడిన బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకోవడాన్ని శ్రీలంక జట్టు నిరాకరించడంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీలంక కెప్టెన్ చండీమాల్ ఓ తీపి పదార్థాన్ని ఉపయోగించి బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించాడు.
దీంతో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అతడిపై ఓ టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించాడు. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. ఫలితంగా వెస్టిండిస్తో జరిగే మూడో టెస్టుకు దినేశ్ చండీమాల్ దూరం కానున్నాడు. తాను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమాల్ ఆ తర్వాత నిజాన్ని అంగీకరించాడు.
బాల్ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో వెల్లడైంది. మ్యాచ్ వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందని అన్నాడు.
దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామని అన్నాడు. ఐసీసీ నిబంధనావళిని అనుసరించి అతడిపై చర్యలు తీసుకున్నట్టు వివరించాడు. అయితే తాజాగా గ్రౌండ్లోకి వెళ్లకుండా తాము తప్పు చేసినట్లు అంగీకరించడంతో చండీమాల్తోపాటు కోచ్, మేనేజర్ కూడా నిషేధం ఎదుర్కోనున్నారు.