కెప్టెన్గా రోహిత్ అర్హుడు:
ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్కు వైస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ తర్వాత టీ20 కెప్టెన్గా అర్హుడని మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ అర్హుడు. ఎందుకంటే అతడికి అవకాశం ఇచ్చినప్పుడల్లా కెప్టెన్గా అద్భుతంగా రాణించాడు. 2018లో అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జట్టును కూడా అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. టీ20 కెప్టెన్గా లోకేష్ రాహుల్ పేరు కూడా వినబడుతోంది. అయితే ఇప్పుడే అతడికి కెప్టెన్సీ ఇవ్వడం తొందరపాటు అవుతుంది' అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.
సరైన నిర్ణయం తీసుకున్నాడు:
'టీ20 కెప్టెన్గా వైదొలగాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం నేను ఊహించినదే. కోహ్లీ టీమిండియా కెప్టెన్గా ఉంటూ దాదాపు ఎనిమిదేళ్లుగా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ బ్యాట్స్మన్గా ఉన్నాడు. అయితే కోహ్లీపై ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అతడు క్రీజులో ఉన్న ప్రతీసారి మంచి ప్రదర్శన ఆశిస్తాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్ గెలిచి.. కోహ్లీ కెప్టెన్సీకి ఉన్నతంగా వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నా. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి భారత్ టీ20 ప్రపంచకప్ 2021 గెలుస్తుంది' అని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు.
సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు:
వన్డే, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చని టీమిండియా మాజీ క్రికెటర్. స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒకే సారథి ఉంటే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. 'రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ విషయంలో పని విభజన ఉండటం మంచిదే. జో రూట్-ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్-టిమ్ పైన్.. వీళ్లను చూస్తే పరిమిత ఓవర్ల, టెస్టులకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుస్తుంది. కానీ వన్డేలు, టెస్టులకు సారథ్య బాధ్యతలు తీసుకోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువే అనిపిస్తోంది. నిజానికి ఒక జట్టు వన్డేలు ఆడినా, టీ20లు ఆడినా పెద్దగా తేడా ఉండదు. జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండవు. భారత జట్టులో ఏడు నుంచి తొమ్మిది మంది ప్లేయర్లు రిపీట్ అవుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇద్దరు కెప్టెన్లు ఎందుకు?. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే కోహ్లీ వన్డేలకు ఎక్కువ రోజులు కెప్టెన్గా ఉండే అవకాశం లేదు. ఇక కాబోయే సారథి రోహిత్ శర్మ అనుకుంటే.. వచ్చే వన్డే ప్రపంచకప్ నాటికి పూర్తిస్థాయిలో జట్టును తయారుచేసుకోవాలంటే కెప్టెన్సీ విషయంలో మార్పులు చేస్తేనే బాగుంటుంది' అని ఆకాష్ పేర్కొన్నాడు.
ఆ నిర్ణయం సరైందే:
తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై స్పందించాడు. 'విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని నేను భావిస్తున్నా. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఒకవేళ అతడు బాగా ఆడితే.. అంతా సవ్యంగా సాగుతుంది. అదే విఫలమైతే.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాడు. ప్రతి ఒక్కరూ అతడిని తిట్టిపోస్తారు. అతడు ఒత్తిడిని తట్టుకొని ఆడుతున్నాడు. అయితే చివరిసారి ప్రపంచకప్కు నాయకత్వం వహించి కోహ్లీ జట్టు విజయం సాధించి కప్పు అందుకునే ఒక అవకాశం ఉన్నందున సంతోషంగా ఉంది' అని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.
ఒక్క ఐసీసీ టైటిల్ లేదు:
2014లో ఎంఎస్ ధోనీ నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని అందుకున్నాడు. మూడేళ్ల పాటు వన్డే, టీ20ల్లో ధోనీ సారథ్యంలో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాడు. ఇక 2017లో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా విరాట్ బాధ్యతలు చేపట్టాడు. మరో రెండేళ్ల పాటు మహీ అతడికి తోడుగానే ఉన్నాడు. ఈ నాలుగేళ్ల కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటి వరకూ కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ని కూడా భారత్ జట్టు గెలవలేదు. మరోవైపు ఐపీఎల్లో రోహిత్ శర్మ తన సారథ్యంతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్గా ముంబై టీమ్ని ఐదుసార్లు విజేతగా నిలిపి అందరిని ఆశ్చర్యపరిచాడు. దాంతో పాటు నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్గా భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. అలానే గత రెండేళ్లుగా మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తూ.. భారత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఇప్పుడు తప్పుకోవడంతో అందరూ రోహిత్ శర్మను సారథిగా చేయాలంటుంన్నారు.