
కోహ్లీని ఎంపిక చేయాలనుకున్నాం:
దిలీప్ వెంగ్సర్కార్ తాజాగా న్యూస్ నేషన్తో మాట్లాడుతూ... '2008లో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. నేను, సెలెక్షన్ కమిటీ అండర్ -23 ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలనుకున్నాం. అప్పటికే కెప్టెన్గా విరాట్ కోహ్లీ అండర్-19 వన్డే ప్రపంచకప్ను గెలిచాడు. అండర్ -23లో కూడా బాగా ఆడుతున్నాడు. టీమిండియాలోకి కోహ్లీని ఎంపిక చేయడానికి అదే సరైన సమయమని నాతో పాటు సెలెక్షన్ కమిటీ భావించింది. దిలీప్ భాయ్ మీరు చెప్పింది చేద్దాం అని నా కమిటీ సభ్యులు కూడా అన్నారు' అని తెలిపాడు.

ధోనీకి ఇష్టం లేదు
'శ్రీలంక పర్యటన కోసం టీమిండియాలోకి విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తున్నాం అని అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టెన్, కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు చెప్పాం. కోహ్లీ బ్యాటింగ్ చూడలేదని, అతనికి చాన్స్ ఇవ్వడం అవసరం లేదు, ఇదే జట్టుతో కొనసాగుతాం అని అన్నారు. మీరు అతన్ని ఆటను చూడలేదు కానీ.. నేను చూశాను. కోహ్లీని జట్టులోకి తీసుకుంటున్నాం అని వారితో చెప్పాను' అని దిలీప్ వెంగ్సర్కార్ పేర్కొన్నారు.

శ్రీనివాసన్ అభ్యంతరం
అప్పటి బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని కూడా విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెంగ్సర్కార్ తెలిపాడు. దేశవాళీల్లో పరుగులు చేస్తున్న తమిళనాడు ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ను టీమిండియాలోకి ఎంపిక చేయాలని సూచించినట్లు పేర్కొన్నాడు. ధోనీ కూడా బద్రీనాథ్ను ఎంపిక చేయాలని శ్రీనివాసన్కు మద్దతుగా ఉన్నాడట. కోహ్లీని జట్టులోకి తీసుకోవడం పట్ల వారు సంతోషంగా లేరని వెంగ్సర్కార్ చెప్పుకొచ్చాడు. గతంలో చెన్నై తరఫున బద్రీనాథ్ ఆడిన విషయం తెలిసిందే.

ధోనీతో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా
భారత్ తరఫున ఎంఎస్ ధోనీతో, ఐపీఎల్లో ఏబీ డివిలియర్స్తో జోడిగా మైదానంలో ఆడటాన్ని బాగా ఇష్టపడతా.. ఆటలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా మిత్రులపై మాత్రం ఆగ్రహం చూపించలేను అని తాజాగా కోహ్లీ అన్నాడు. 'నాతో పోటీపడుతూ వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తే వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తాను. టీమిండియా తరఫున ఆడే సమయంలో ధోనీ.. ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడేటప్పుడు ఏబీ డివిలియర్స్ నా జాబితాలో ఉన్నారు. ఈ ఇద్దరితో కలిసి బ్యాటింగ్ చేసే సమయంలో వికెట్ల మధ్య పరుగు కోసం ప్రత్యేకంగా పిలుపులు ఉండవు. ఒకరినొకరు చూసుకుని పరుగెత్తేస్తామంతే' అని కోహ్లీ తెలిపాడు.


Click it and Unblock the Notifications












