
ఆసియా కప్ - 2022లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడని భారత మాజీ బ్యాటర్ దిలీప్ వెంగ్సర్కార్ ఆశించాడు. కోహ్లీ విరామం తర్వాత తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకు కోహ్లీకి సెలెక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇకపోతే గల్ఫ్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్సర్కార్ మాట్లాడుతూ.. తాను ముంబైలో ఇటీవల కోహ్లీ శిక్షణను చూశానని, అతని ఇంటెన్సివ్ ప్రిపరేషన్కు ఫిదా అయ్యానని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. నేను సైతం చాలా అభిమానిని. దురదృష్టవశాత్తు ఇటీవల ఫామ్ కోల్పోయి అతను ఇబ్బంది పడుతున్నాడు. అతను చాలా రోజులుగా లీన్ ప్యాచ్ ఎదుర్కోవడం కొంత విచారకరమేనని' వెంగ్సర్కర్ తెలిపాడు.
'ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత కోహ్లీ కేవలం ఒక్క సిరీస్ మాత్రమే ఆడాడు. అతనో గొప్ప ప్లేయర్. అతను పాకిస్థాన్పై సెంచరీ సాధిస్తాడనుకుంటున్నా. అతను బాగా సిద్ధమయ్యాడని నేను కచ్చితంగా చెప్పగలను. నేను ముంబైలో అతన్ని కలిసినప్పుడు అకుంఠిత సాధన చేస్తూ కన్పించాడు. చాలా ఫిట్గా తయారయ్యాడు. తప్పకుండా అతను తన మునుపటి ఫాంతో రాణించడానికి సిద్ధమవుతాడు' అని వెంగ్సర్కర్ అన్నారు.
ఇకపోతే ఆసియాకప్ టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లాంటి స్టార్ పేసర్లు దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరున్నా లేకున్నా ఇండియాకు పెద్ద ఇబ్బందేం లేదని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డాడు. 'భారత్కు మంచి బెంచ్ బలం ఉంది. ఐపీఎల్ పుణ్యమా అని ఇండియాకు ఇప్పుడు చాలా మంది పేస్ బౌలర్లు ఉన్నారు. సాదాసీదా బౌలర్లు కాదు నాణ్యమైన వారే చాలా మంది ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్నర్లకు ఇప్పుడు కొదవ లేదు. కాబట్టి బుమ్రానో మరొకరో లేనంత మాత్రాన పెద్ద ఇబ్బందేం లేదు.' అని వెంగ్సర్కార్ చెప్పారు.