
టీమిండియా టెస్టు కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ దిలీప్ వెంగ్సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టెస్టు కెప్టెన్గా వెటరటన్ ప్లేయర్లు అయినా రోహిత్ శర్మ, రవి చంద్రన్ అశ్విన్లలో ఒకరిని ఎంపిక చేయాలని సూచించారు. రోహిత్ శర్మ లేదా రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరిని ఏడాది ఏడాది పాటు భారత టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉంచాలని తెలిపారు. ఈ ఏడాది కాలంలో టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ను తయారు చేసుకోవాలని వెంగ్ సర్కార్ సూచించారు. తాను సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్య వచ్చిందని ఆయన తెలిపారు. అప్పుడు కెప్టెన్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని, దీంతో కెప్టెన్గా ఎవరిని నియమించాలనే అయోమయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు.
అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న మహేంద్రసింగ్ ధోనిని టెస్టు కెప్టెన్గా కూడా నియమించాలని సూచనలు వచ్చినట్టు తెలిపారు. అయితే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోని అప్పటి ఆస్ట్రేలియా పర్యటనకు సీనియర్ ఆటగాడైనా అనిల్ కుంబ్లేను కెప్టెన్గా ఎంపిక చేసినట్లు చెప్పారు. అప్పుడు కుంబ్లే కెప్టెన్గా రాణించాడని, అదే సమయంలో ధోనిని భవిష్యత్ టెస్టు కెప్టెన్గా తీర్చిదిద్దామని వెంగ్సర్కార్ తెలిపారు.
అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో విఫలమవడంపై కూడా వెంగ్సర్కార్ స్పందించారు. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే బ్యాటింగ్లో విఫలమవుతున్నాడనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. భారతీయులు ఎప్పుడూ కూడా రికార్డుల ఆధారంగానే ఆటగాళ్లను అంచనా వేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లుగా కెప్టెన్గా, బ్యాటర్గా కోహ్లీ రాణిస్తున్నాడని అన్నారు. రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయని మాట వాస్తవమే అయినప్పటికీ జట్టుకు అవసరమైనప్పుడు విలువైన పరుగులు చేస్తున్నాడని వెంగ్ సర్కార్ గుర్తు చేశారు. సౌతాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో 160 బంతులు ఎదుర్కొని 79 పరుగులతో సత్తా చాటాడని వెంగ్ సర్కార్ తెలిపారు.
1975 నుంచి 1992 మధ్య దిలీప్ వెంగ్సర్కార్ భారత జట్టులో మంచి బ్యాటర్గా రాణించారు. ఈ క్రమంలో 116 టెస్టు మ్యాచ్లు ఆడి 41 సగటుతో 6868 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 166 పరుగులు. ఇక 129 వన్డే మ్యాచ్ల్లో 34 సగటుతో 3508 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 105 పరుగులు.