
కోహ్లీ, రోహిత్లకు కష్టమే:
ఆదివారం బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ గురించి మాట్లాడారు. 'విరాట్ కోహ్లీ చాలా కాలంగా బాగా ఆడుతున్నాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ బ్యాట్స్మెన్లో అతడు ఒకడు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. టీమిండియా కోసం ఎంతో చేశారు. ఎన్నో గొప్ప విజయాలు అందించారు. వాళ్లిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. కానీ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం మాత్రం ఫైనల్లో వాళ్లను ఇబ్బంది పెడుతుందని నేను భావిస్తున్నా. ఇంగ్లండ్ పరిస్థితులలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోతే కాస్త ఇబ్బందే' అని వెంగ్సర్కార్ అన్నారు.

ప్రాక్టీస్ మ్యాచులు చాలా ముఖ్యం:
'టీమిండియా మెరుగైన జట్టు. ఆటగాళ్లు అందరూ గొప్ప ఫామ్లో ఉన్నారు. అయితే న్యూజిలాండ్కు ఓ ప్రయోజనం ఉంది. ఆ జట్టుపై ఎక్కువగా అంచనాలు లేవు. ఇక చాంపియన్షిప్ ఫైనల్కు ముందు ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడుతుండటం న్యూజిలాండ్కు కలిసొస్తుంది. ఫైనల్కు ముందే వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడతారు. ఇది ఒకరకంగా ఆ టీమ్ను ఇండియా కంటే కాస్త రేసులో ముందు నిలబెట్టింది. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడటానికి ఈ మ్యాచ్కు ముందు ఇండియా కనీసం రెండు, మూడు మ్యాచ్లు ఆడితే బాగుండేది. నెట్ ప్రాక్టీస్ ఎంత చేసినా.. మ్యాచ్ ప్రాక్టీస్ ఉండటం చాలా ముఖ్యం' అని దిలీప్ వెంగ్సర్కార్ పేర్కొన్నారు.

భారీ డ్రైవ్స్ ఆడొద్దు:
టీమిండియాకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ కొన్ని సూచనలు చేశారు. 'మేం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంగ్లండ్లో పర్యటించేటప్పుడు పక్కన కౌంటీ మ్యాచులు ఆడేవాళ్లం. దాంతో అక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడేవాళ్లం. అక్కడి అదనపు స్వింగ్ను ప్రత్యేకించి ఆఫ్ వికెట్పై ఎదుర్కోవాలంటే సైడ్ ఆన్ బ్యాటింగ్ స్టాన్స్ తీసుకోవడం ముఖ్యం. ఆరంభంలోనే అక్కడ భారీ డ్రైవ్స్ ఆడొద్దు. ఎందుకంటే బంతి పక్కకు దూసుకెళ్తుంది. హాఫ్ వ్యాలీ చూడగానే భారీ డ్రైవ్ చేయాలనుకుంటే స్లిప్లో చిక్కే అవకాశం ఉంటుంది. అందుకే డ్రైవ్ ఆడటం బదులు బంతిని పుష్ చేస్తే మంచిది' అని వెంగీ చెప్ప్పుకొచ్చారు.

నిలదొక్కుకొని ఆడితే:
ఇంగ్లండ్లో ఆకాశం అప్పటికప్పుడు మబ్బులు పట్టేస్తుందని, హఠాత్తుగా ఎండ కాసి బ్యాటింగ్కు అనుకూలిస్తుందని దిలీప్ వెంగ్సర్కార్ అన్నారు. ఒకే రోజు రకరకాల రుతువులు కనిపిస్తాయని, దాంతో బ్యాట్స్మెన్ నిలదొక్కుకోలేరన్నారు. భారత్లో అయితే 30 పరుగులు చేస్తే భారీ ఇన్నింగ్స్ ఆడొచ్చని పేర్కొన్నారు. ఇంగ్లండ్లో నిలదొక్కుకోవాలంటే సన్నాహక మ్యాచులు ఆడటం ఎంతో కీలకమని వెల్లడించారు. మ్యాచ్ మధ్యలో నిలదొక్కుకొని ఆడితే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని ఆయన వెల్లడించారు. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












