
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలే బెంగళూరులో ఓ ఇంటర్యూలో పాల్గొన్న అనిల్ కుంబ్లే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరిస్ను గెలిచే సత్తా కోహ్లీ సేనకే ఉందని కొనియాడటంతో పాటు మంగళవారం ముంబైలో జరిగిన విరుష్క రిసెప్షన్కు హజరవ్వడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ముంబై రిసెప్షన్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబై లోయర్ పర్ల్లోని రెజీస్ ఆస్టర్ బాల్రూమ్లో జరిగిన ఈ వివాహ విందుకు అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారత జట్టులోని క్రికెటర్లంతా ప్రత్యేక సూట్లతో దర్శనమిచ్చారు.
పాత విభేదాలను పక్కనబెడుతూ భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సతీసమేతంగా ఈ వివాహ విందుకు హాజరవడం క్రికెట్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు అనిల్ కుంబ్లే హాజరవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గొడవలు ఆటలో భాగమే కానీ.. వ్యక్తిగతం కాదంటూ కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
ఇంకొందరైతే విరాట్ కోహ్లీ రిసెప్షన్కు కుంబ్లే హజరయ్యాడంటే మేము నమ్మమని ట్వీట్లు పెడుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కోచ్గా కుంబ్లే ఆటగాళ్లను ఇబ్బంది పెడుతన్నాడని, ఓ హెడ్ మాస్టర్లా వ్యవహారిస్తున్నాడని జట్టులోని ఆటగాళ్లంతా ఫిర్యాదు చేయడంతో కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే.
అనంతరం ఈ ఇద్దరూ బాహటంగానే దీనిపై పలుమార్లు స్పందించారు. సెప్టెంబర్ 5న టీచర్స్డే సందర్భంగా కోహ్లీ సోషల్ మీడియాలో తన గురువులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో కుంబ్లే లేకపోవడంపై కోహ్లీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగత తెలిసిందే.