
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి స్పందించాడు. ఇద్దరు అగ్రశ్రేణి క్రికెటర్ల మధ్య కావాలనే రూమర్లు సృష్టిస్తున్నారని గల్ఫ్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి మండిపడ్డాడు.
గత ఐదేళ్లుగా తాను భారత జట్టులోని ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకుంటున్నానని, ఎవరి మధ్య ఎటువంటి విభేదాలను తాను చూడలేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ "15 మంది ఆటగాళ్ళు ఉన్నప్పుడు భిన్నంగా ఉండే అభిప్రాయాలు ఉన్న సందర్భాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అది అవసరం కూడా. అయితే, అందరూ ఒకే వరుసలో ఉండాలని నేను కోరుకోను" అని అన్నాడు.
"చర్చలు జరుగుతున్న సమయంలో ఎవరైనా ఒక కొత్త వ్యూహాన్ని వెల్లడిస్తే వారిని ప్రోత్సహించాలి. కుర్రాళ్ళు తమను తాము వ్యక్తీకరించుకునే అవకాశాన్ని ఇవ్వాలి, ఆ తర్వాత ఏది ఉత్తమమో నిర్ణయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది జూనియర్ ప్లేయర్ కూడా కావొచ్చు. ఆ వ్యూహాన్ని టేబుల్పైకి తీసుకు రావాల్సిందే. కాబట్టి దీనిని ఓ గొడవ మాదిరి చూడకూడదు" అని రవిశాస్త్రి తెలిపాడు.
రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలపై వెస్టిండిస్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. తాజాగా, రవిశాస్త్రి ఈ అంశంపై మాట్లాడుతూ "వినండి, గత ఐదు సంవత్సరాలుగా ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ని పంచుకుంటున్నాను. బాలురు ఎలా ఆడారో, వారు జట్టును ఎలా పూర్తి చేసారో నేను చూశాను. వారి పని గురించి తెలుసు. ఇది అర్ధంలేనిదని నేను భావిస్తున్నాను" అని అన్నాడు.
"టీమిండియా ఆటగాళ్లంతా ఎలా ఆడాలనే దానిపై దృష్టి పెట్టడమే నేను చూశా. అదే జరుగుతుంది కూడా. వరల్డ్కప్లో మనం చూసింది ఇదే. రోహిత్ ఐదు సెంచరీలు చేశాడు. కోహ్లి ఎంతగా ఆకట్టుకున్నాడో కూడా చూశాం. రోహిత్-కోహ్లిలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కచ్చితంగా చెప్పగలను రోహిత్-కోహ్లిల మధ్య ఎటువంటి విభేదాలు చోటు చేసుకోలేదు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.