
హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ తనను జాతీయ జట్టులో ఎంపిక చేయకపోవడంపై పాకిస్థాన్ వెటనర్ క్రికెటర్ ఫవాద్ అలామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు సెలక్టర్ల తీరుని ప్రశ్నించాడు. దేశవాళీ మ్యాచ్ల్లో మొత్తం 164 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన ఫవాద్ అలామ్ 57 యావరేజితో 12,106 పరుగులు చేశాడు.
అయినప్పటికీ పాకిస్థాన్ సెలక్టర్లు అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. పాకిస్థాన్ తరుపున కేవలం మూడు టెస్టులు ఆడిన ఫవాద్ అలామ్ చివరగా 2009లో ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా, ఫవాద్ జియో న్యూస్తో మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.
"సహజంగానే ఇది బాధిస్తుంది. కానీ, నేను ఆశను కోల్పోలేదు. ప్రపంచంలో నిలవాలంటే ఆశే ముఖ్యం. ఆ ఆశే నన్ను కూడా నిలబెట్టింది. నేను పీసీబీని లేదా సెలెక్టర్లను వెళ్లి ప్రశ్నించగల పెద్ద స్టార్ ప్లేయర్ కాదు. కానీ నేను నా సహచర క్రికెట్లతో మాట్లాడినప్పుడు నన్ను దూరంగా ఉంచడానికి గల కారణం మాత్రం తెలియలేదు" అని ఫవాద్ అన్నాడు.
ఇటీవలే ఖ్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో సింధ్ తరఫున ఆడిన ఫవాద్ డబుల్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో చోటు లభిస్తుందని అందరూ భావించినప్పటికీ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. అయితే తాను మళ్లీ పాక్ తరఫున ఆడతాననే ఆశతోనే ఉన్నాడని అలామ్ చెప్పాడు.