విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఓ అనుకోని అతిథి టెస్టు మ్యాచ్కి అంతరాయం కలిగించడంతో ముందుగానే టీ విరామాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదే అతిథి ఇంగ్లాండ్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూంలోకి వచ్చిందట.
ఈ విషయాన్ని ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు స్లీవెన్ ఫిన్ తన ఇన్స్టాగ్రాం ద్వారా తెలిపాడు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో తొలి రోజు మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుక్క మైదానంలోకి ప్రవేశించింది. అదే శునకం ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూంలోకి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

అంతేకాదు డ్రెస్సింగ్ రూంలో కుక్కు ఉన్న ఫోటోను స్లీవెన్ ఫిన్ తన ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టీమిండియా బ్యాట్స్మెన్లు కోహ్లీ( 91 వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు), పుజారా (97 నాటౌట్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఓ కుక్క మైదానంలోకి ప్రవేశించింది.
ఆ తర్వాత మైదానంలో అన్ని వైపులకూ ఉరుకులు పరుగులు పెడుతూ కాసేపు చికాకు తెప్పించింది. కుక్క మైదానంలోకి ప్రవేశించడంతో అక్కడున్న వారికి అది నవ్వులు తెప్పించింది. ఇదే సమయంలో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కుక్కను భయపెట్టే ప్రయత్నం చేశాడు.
అయినప్పటి అది ఏ మాత్రం భయపడకుండా పరుగులు పెట్టింది. దాంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రెండో సెషన్ టీ విరామ సమయాన్ని ముందే ఇచ్చేశారు. చివరికి బాల్ బాయ్ కుక్కను బయటకు పంపడంతో టీ విరామం తర్వాత మ్యాచ్ సజావుగా సాగింది.
తాజాగా మళ్లీ అదే కుక్క ఇంగ్లాండ్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని ఫిన్ తన ఇన్స్టాగ్రాం ద్వారా తెలుపుతూ 'సందర్శకులు ఈ రోజు మా డ్రస్సింగ్ రూంలోకి వచ్చారు' అంటూ ఫొటోను పంచుకున్నాడు. మైదానంలోకి వచ్చిన కుక్కే తమ డ్రస్సింగ్ రూమ్లోకి వచ్చిందంటూ ట్విట్టర్లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు.
అయితే విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ శునకానికి కూడా మైదానంలోకే ఉచిత ప్రవేశాన్ని కల్పించారంటూ పలువురు ట్విట్టర్లో ఛమత్కరించారు.