మరో ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఇంకో మూడు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ సందడి షురూ కానుంది. ఈ సందర్భంగా ఈ వన్డే మెగా టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగనున్న టీమిండియా.. తాజాగా దుబాయ్ లో అడుగుపెట్టింది. అయితే సాధారణంగా ట్రావెలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మకు తనకు సంబంధించిన వస్తువులు లేదా ఏదైనా విషయాన్ని మర్చిపోయే అలవాటు ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రోహిత్ కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. మళ్లీ రోహిత్ ఏమైనా మర్చిపోయాడా ఏంటి అని అనుకుంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పాక్ జట్టు కూడా దుబాయ్ కే..
రీసెంట్ గా ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా ప్రస్తుతం విజయోత్సాహంలో ఉంది. ఈ గెలుపుతో రెట్టింపు ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. కానీ టీమిండియా దాయాది దేశంలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో భారత జట్టు మ్యాచులు యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఒకవేళ టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించిన మ్యాచ్ అక్కడే నిర్వహిస్తారు. ఈ నెల 23న భారత్ - పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరగనుంది. దీని కోసం పాకిస్థాన్ జట్టు దుబాయ్ కే వెళ్లనుంది.

భారీ ఎత్తున ఫ్యాన్స్..
అయితే తాజాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ కు వెళ్లేందుకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి టీమిండియా బయలు దేరింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లు, కోచ్ గౌతమ్ గంభీర్.. టీమ్ బస్సులో విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భారత జట్టుకు మద్దతుగా నినాదాలు కూడా చేశారు. అనంతరం టీమిండియా దుబాయ్ కు చేరుకుంది.
మళ్లీ రోహిత్ మర్చిపోయాడా ఏంటి?
ఇక్కడి వరకు అంతా బానే సాగినా.. దుబాయ్ ఎయిర్ పోర్టులో టీమ్ బస్సు డోర్ దగ్గర కొంత సేపు దేని కోసమో రోహిత్ శర్మ వెయిట్ చేస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. దీంతో రోహిత్ మళ్లీ ఏమైనా మర్చిపోయాడా అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది. అసలు రోహిత్ కు ప్రయాణం చేసేటప్పుడు పాస్ పోర్టు, బ్యాగ్స్ లేదా ఇతర వస్తువుల్ని మర్చిపోయే ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ వాస్తవానికి రోహిత్ శర్మ వెయిట్ చేసింది కేఎల్ రాహుల్ కోసమట. రాహుల్ బస్సు దగ్గరు కాస్త ఆలస్యంగా రావడంతో.. అతడి కోసం రోహిత్ ఎదురు చూసినట్లుగా తెలిసింది.