వారెవ్వా.. భారత్-అఫ్గానిస్థాన్ ఆఖరి టీ20 మ్యాచ్ అదిరింది! నరాలు తెగే ఉత్కంఠ పోరు, అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్లా చరిత్రలో నిలిచింది. టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడిన ఆఖరి టీ20 మ్యాచ్లో ఊహించని నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రతి ఓవర్ క్లైమాక్స్లా తలపించింది.
మొదట 22/4తో కష్టాల్లో నిలిచిన జట్టును రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో), రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో) అద్భుత పోరాటంతో టీమిండియా స్కోరును 212/4కు చేర్చారు. ఈ క్రమంలో రికార్డులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అఫ్గానిస్థాన్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. కానీ 20 ఓవర్లలో 212/6 స్కోరుతో నిలిచి మ్యాచ్ను 'టై' గా ముగించింది. దాంతో సూపర్ ఓవర్కు దారి తీసింది.

సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 16/1తో నిలిచింది. ముకేశ్ కుమార్ వేసిన తొలి బంతికి నైబ్ రనౌటవ్వగా, తర్వాత నబి, గుర్బాజ్ చెలరేగి పరుగులు సాధించారు. అనంతరం సూపర్ ఓవర్ ఛేజింగ్లో రోహిత్ రెండు సిక్సర్లు సాధించాడు. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన సందర్భంలో జైశ్వాల్ ఒక్క పరుగే చేయడంతో భారత్ కూడా 16/1 తో నిలిచింది. దాంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది.
ఈ సారి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రోహిత్ 11 పరుగులు చేయగా, తర్వాత భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. రింకూ వికెట్ కీపర్ ఇచ్చి వెనుదిరగగా, తర్వాతి బంతికి రోహిత్ రనౌటయ్యాడు. అనంతరం రవి బిష్ణోయ్ అద్భుత బౌలింగ్తో రెండో సూపర్ ఓవర్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలి బంతికే నబి ఔటవ్వగా, రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది. మూడో బంతికి గుర్బాజ్ ఔటయ్యాడు.
రెండో సూపర్ ఓవర్తో మ్యాచ్ ఫలితం రావడం అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్లో కూడా ఒకేరోజు తాను మూడు సార్లు బ్యాటింగ్కు రాలేదని, కానీ ఇవాళ మ్యాచ్లో రావాల్సి వచ్చిందని రోహిత్ పేర్కొన్నాడు.
''టెస్టుల్లో కూడా మేం ఇలా చేయలేదు. ఐపీఎల్లో ఒక్క మ్యాచ్లో ఇలా మూడు సార్లు బ్యాటింగ్ చేశాననుకుంటా. అయితే మేం భాగస్వామ్యాన్ని నెలకొల్పడం చాలా కీలకం. మా ఉద్దేశాల గురించి రింకూ సింగ్తో చర్చించుకున్నాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆఖరి వరకు, లోతుగా బ్యాటింగ్ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో ఈ విషయాన్ని రాజీపడొద్దని భావించాం. ఇదో మంచి గేమ్''

''రింకూ సింగ్ తాను ఆడిన చివరి రెండు సిరీస్లో గొప్పగా ఆడాడు. తాను ఏం చేయగలడో నిరూపించాడు. నిర్భయంగా, ప్రశాంతంగా ఆడతాడు. తన గేమ్ ప్లాన్ చాలా స్పష్టంగా ఉంటుంది. తన బలాలేంటి అతడికి తెలుసు. అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తాచాటుతున్నాడు. గత 10 ఇన్నింగ్స్లో టీమిండియా తరపున అదరగొట్టాడు. స్పష్టమైన బ్యాటింగ్ చేయగలిగే వ్యక్తినే మేం కోరుకుంటున్నాం. అతడు ఐపీఎల్లో రాణించాడు. టీమిండియాలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు'' అని రోహిత్ శర్మ అన్నాడు.