Yashaswi Jaiswal: టీమిండియా డేంజరస్ బ్యాటర్ల ఒకరైన యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ముంబైకి బదులుగా గోవా నుంచి దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. యశస్వి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబై వదిలి గోవాకు వెళ్లాలనే కోరికను వ్యక్తం చేస్తూ యశస్వి జైస్వాల్ మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్కు లేఖ రాశారు. పాలకమండలి వెంటనే యశస్వి అభ్యర్థనను అంగీరించింది. యశిస్వి జైస్వాల్ 2025-26 సీజన్ నుంచి గోవా తరపున ఆడనున్నాడు. అక్కడ యశస్వి జైస్వాల్ను కెప్టెన్ గా కూడా నియమించవచ్చు.
ఇప్పుడు యశస్వి జైస్వాల్ గురించి కీలక విషయం బయటపడింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానేతో గొడవ కారణంగానే యశస్వి జైస్వాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్ ఆటతీరును ముంబై కెప్టెన్ అజింక్య రహానె ప్రశ్నించడమే ఈ పరిస్థితులకు దారి తీసినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో జమ్మూకాశ్మీర్తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే ఔటైన తర్వాత ముంబై కెప్టెన్ రహానె, కోచ్ ఓంకార్ సాల్వి యశస్వి కమిట్మెంట్ ను ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అజింక్య రహానె కిట్ బ్యాట్ను యశస్వి అసహనంతో తన్నినట్లు సమాచారం. ఆ తర్వాత ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్టేట్మెంట్ కూడా యశస్వి జైస్వాల్ కు కోపం తెప్పించింది.

2022లో రహానె వెస్ట్ జోన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు యశస్వితో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దులీప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ ఆటగాడు రవితేజను జైస్వాల్ ఎక్కువగా స్లెడ్జ్ చేశాడు. అప్పుడు కెప్టెన్ రహానే వెంటనే యశస్వి జైస్వాల్ ని మైదానం వీడి వెళ్లాలని ఆదేశించడంతో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య వివాదం ప్రారంభమైంది.
ముంబై వదిలి వెళ్ళేటప్పుడు యశస్వి జైస్వాల్ ఏమన్నాడంటే?
తాను ముంబైని వీడి గోవా తరపున ఆడడానికి కారణమేంటో యశస్వి జైస్వాల్ వెల్లడించాడు. గోవా తరపున ఆడేందుకు తనకు మంచి ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ.."ఇది నాకు చాలా కష్టమైన నిర్ణయం. నేను ఇలా ఉండడానికి కారణం ముంబై. ఈ నగరమే నన్ను ఇలా మార్చింది. నేను ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. గోవా నాకు కొత్త అవకాశాన్ని ఇచ్చింది. నాయకత్వ పాత్రను ఇచ్చింది. ఎప్పటికీ నా తొలి ప్రాధాన్యం టీమిండియాదే. జాతీయ జట్టుకు ఆడనప్పుడు మాత్రం తప్పకుండా గోవాకు ఆడతా. నేను గోవా తరపున ఆడి జట్టును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను." అని యశస్వి జైస్వాల్ అన్నాడు.