హైదరాబాద్: ఓ వైపు టీమిండియా కెప్టెన్ మెడ నొప్పి కారణంగా విశ్రాంతిలో ఉన్నాడు. దీంతో ఇప్పటికే అఫ్ఘనిస్థాన్తో చారిత్రాత్మక టెస్టుకు దాదాపు అందుబాటులో ఉండడని ఖరారైపోయింది. ఒకవేళ కోహ్లీ ఫిట్నెస్ టెస్టులో పాసైపోతే.. ఇంగ్లాండ్తో తలపడనున్న సిరీస్లో టీమిండియాకు అందుబాటులోకి రానున్నాడు. ఇలాంటి సమయంలో.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవడానికి భారత్కు ఇదే మంచి అవకాశమని అంటున్నాడు ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్.
జులైలో కోహ్లీ సేన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఇంగ్లాండ్తో భారత్ టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. జులై 3 నుంచి ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టులో టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ మాట్లాడాడు.
'ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. బౌలర్లతో పాటు బ్యాట్స్మెన్లు ఈ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్దే విజయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలిచేందుకు భారత్కు ఇదో అరుదైన, మంచి అవకాశం కూడా. ఒత్తిడిని తట్టుకోలేక ఇంగ్లాండ్ జట్టు ఇటీవల లార్డ్స్ వేదికగా పాక్తో జరిగిన టెస్టులో ఓడిపోయింది. ఓపెనర్ కుక్ ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నాడు'
'దీంతో ఆ జట్టుకు ఈ మధ్య కాలంలో శుభారంభమే దక్కడం లేదు. అలా అని పూర్తిగా ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయలేం. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను ఎదుర్కొనే సమయంలో భారత ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడతారు. అంతేకాదు కొత్త బంతి వేసే బౌలర్లతో కూడా భారత్కు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. భారత బౌలర్లు ఇంగ్లాండ్ మిడిలార్డర్ను దెబ్బకొడితే ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని చాపెల్ తెలిపాడు.