
అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ
ఐపీఎల్ 12వ సీజన్లో ఢిల్లీ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 14 మ్యాచ్ల్లో విజయం సాధించగా... ఢిల్లీ కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేకాదు సీఎస్కే ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గగా... ఢిల్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. ఇక, ఈ సీజన్లో గ్రూప్ స్టేజిలో తలపడిన రెండు సార్లు ఢిల్లీపై సీఎస్కేనే విజయం సాధించడం విశేషం.

ఈ మ్యాచ్ని పంత్ vs ధోనిగా
ఈ సీజన్లో పంత్, ధోని ఇద్దరూ ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్ని పంత్ vs ధోనిగా అభివర్ణిస్తున్నారు. ఈ సీజన్లో వీరిద్దరూ ఆయా జట్ల తరుపున అద్భుత విజయాలను నమోదు చేశారు. ఈ సీజన్లో లీగ్ దశలో ఇరు జట్లు 14 మ్యాచ్లాడి 9 మ్యాచ్ల్లో విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓడాయి. దీంతో పాయింట్ల పట్టికలో ఇరు జట్ల సమానంగా ఉన్నా... చెన్నై మెరుగైన రన్రేట్ను కలిగి ఉంది.

మహేంద్ర సింగ్ ధోని
ఈ సీజన్లో ధోని అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ఈ సీజన్లో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్ల్లో 405 పరుగులు చేసిన ధోని యావరేజి 135 కావడం విశేషం. అంతేకాదు కేవలం 18 నుంచి 20 ఓవర్లలో ధోని 213 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై ఫైనల్ చేరాలంటే ధోని ఈ మ్యాచ్లో కూడా రాణించాలి.

రిషబ్ పంత్
ఈ సీజన్లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లాడిన రిషబ్ పంత్ 450 పరుగులు చేశాడు. ధోనితో పోలిస్తే పంతే ఈ సీజన్లో అత్యధికంగా సిక్సులు, ఫోర్లు బాదడం విశేషం. పంత్ అత్యధిక స్కోరు 78 నాటౌట్. యావరేజి 37.50. స్ట్రయిక్ రేట్ 163.63గా ఉంది. అయితే, ఢిల్లీ తరుపున ఫినిషర్ పాత్రను మాత్రం పోషించలేకపోయాడు. కాగా, ఎలిమినేటర్లో మెరుపు బ్యాటింగ్తో సన్రైజర్స్పై ఢిల్లీని గెలిపించాడు.


Click it and Unblock the Notifications












