ధోనీ: దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ పైన జరుగుతున్న చర్చ నేపథ్యంలో వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోనీ ఉన్నాడు. జెఎన్యులో జాతీయవాద వ్యతిరేక నినాదాల నేపథ్యంలో సైన్యం సేవలను ఆయన గుర్తు చేయడం గమనార్హం.
సాయుధ బలగాల మూలంగానే మనం భావప్రకటనా స్వేచ్ఛ పైన చర్చించుకనే స్థితిలో ఉన్నామని ధోనీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా సైన్యం సేవలను గుర్తు చేశాడు.
స్వప్రయోజనాల కంటే ముందుగా దేశం కోసం పాటుపడేలా ప్రేరణ, శిక్షణ పొందిన ప్రత్యేక బలగాలు, కమెండో యూనిట్లలో పని చేసే సైనికులు కూడా మనలాగా సాధారణ పౌరులే అన్నాడు.
పార్లమెంటు దాడి సూత్రదారి అఫ్జలు గురి ఉరితీతను వ్యతిరేకిస్తూ... అఫ్జల్కు మద్దతుగా జెఎన్యు (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం)లో కొద్ది రోజుల క్రితం సభ జరిగింది. ఇది ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
గౌతమ్ గంభీర్ కూడా ఇటీవల దీనిపై స్పందించిన విషయం తెలిసిందే. జేఎన్యూలో గంభీర్ తీవ్రంగా స్పందించారు. జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతున్న రాజకీయ నాయకులు ఎదగాలని సూచించారు.
'జేఎన్యూ, జాదవ్పూర్ యూనివర్సిటీలలో వీడియోలు దిగ్ర్భాంతికి గురిచేశాయి. రాజకీయ నాయకులు ఎదగాలి. దీన్ని రాజకీయం చేయొద్దు. అందరం మదర్ ఇండియా కోసం కలిసి ఉండాలి. అధికారంలోకి వచ్చేందు కోసం దేశ సమగ్రతలో రాజీపడొద్దు' అని గౌతం గంభీర్ ట్వీట్ చేశారు.